మహోన్నతుడు భగవాన్ సత్యసాయిబాబా*, రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవం
Publish Date : 24/11/2025
*మహోన్నతుడు భగవాన్ సత్యసాయిబాబా*
రాష్ట్ర ఎంఎస్ఎమ్ఈ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవంవిజయనగరం నవంబర్ 23 :
మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు.
భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిధులు అంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్య సాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని చెప్పారు. మానవత్వం, మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ, ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. హిందూ మతానికి, హిందూయిజానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు పదివేల సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయని, ఇవే ఆయన గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు మాట్లాడుతూ మానవత్వాన్ని చూపడం, తోటి వారికి సాయం చేయడమే సాయిబాబా బోధనల సారాంశమని పేర్కొన్నారు.
తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి మాట్లాడుతూ, విద్య, ఆరోగ్య సంస్థల ద్వారా లక్షలాదిమందికి సేవనందించి, సత్యసాయి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ, లవ్ ఈజ్ గాడ్ అని ప్రచారం చేసిన వ్యక్తి సత్యసాయి అని అన్నారు. ప్రేమే మతమని, మానవత్వమే కులమని, హృదయమే భాష అని ప్రచారం చేసిన మహోన్నతుడు సత్య సాయిబాబా అని కొనియాడారు.
మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో, ఆర్డిఓ డి.కీర్తి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన భజన గీతాలు ఆకట్టుకున్నాయి.
……….
జారి: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.


2411-A




2411-E