30.10.2025 జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకూ జాగ్రత్త వహించాలి, టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 31/10/2025
పత్రికా ప్రకటన
- జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకూ జాగ్రత్త వహించాలి
- ప్రతి నష్టాన్ని నమోదు చేయాలి
- ప్రభుత్వ భవనాల నష్టాలను అంచనా వేయాలి
- వరద బాధితులకు రేషన్, నిత్యావసరాల పంపిణీ వెంటనే జరగాలి
టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, అక్టోబర్ 30 : జిల్లాలోని జలాశయాలన్నిటి లో ఇన్ఫ్లో , అవుట్ ఫ్లో లను పరిశీలిస్తూ ఎక్కడా ఎటువంటి నష్టాలూ జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జలాశయాల్లో నీటి స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకూ పర్యవేక్షించాలని, వచ్చే రెండు రోజులు జాగ్రత్త వహించాలని తెలిపారు. గురువారం ఉదయం కలెక్టర్ తుఫాన్, వరద పరిస్థితి పై జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలకు, వరదలకు జరిగిన ప్రతి చిన్న నష్టాన్ని కూడా నమోదు చేయాలనీ , అలాగే నష్టం విలువను కూడా అంచనా వేయాలని తెలిపారు. రహదారులు, విద్యుత్, పంట, పశు నష్టాల తో పాటు ప్రభుత్వ భవనాలైన వసతి గృహాలను , పాఠశాలలను , వైద్య, పశు శాఖల భవనాలను నమోదు చేయాలన్నారు. గురువారం సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలను అందజేయాలని తెలిపారు.
సంయుక్త కలెక్టర్ సేదు మాధవన్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ బాధితులైన వారు చేనేత, మత్స్యకార కుటుంబాలు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు 4949 మంది కార్డు దారులు ఉన్నారని, వారిలో చేనేత, మత్స్యకార వారికీ 50 కేజీ ల చొప్పున బియ్యం , పామ్ ఆయిల్ 1 లీటర్ , చెక్కెర 1 కేజీ , ఉల్లిపాయలు 1 కేజీ బంగాళా దుంపలు 1 కేజీ చొప్పున పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికీ 25 కేజీ ల చొప్పున బియ్యం, ఇతర నిత్యావసరాల వస్తువులు అందించనున్నట్లు తెలిపారు. ఈ సరుకులు వెంటనే అందేలా తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
…………………………………………………………………………………………………………………
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.

31-10