Accelerate National Highway Land Acquisition * Land should be handed over to the owner within the stipulated time * Collector A. Suryakumari directed the officers in the review
Publish Date : 08/12/2021
జాతీయ రహదారి భూ సేకరణలో వేగం పెంచాలి
* నిర్ణీత గడువులోగా యాజమాన్యానికి భూమి అప్పగించాలి
* సమీక్షలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, డిసెంబర్ 08 ః విశాఖపట్టణం – రాయ్పూర్ ఎన్.హెచ్. 130 సీడీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా సంబంధిత యాజమాన్యానికి భూమి అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. జేసీ కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఆర్డీవో భవానీ శంకర్, ఎన్హెచ్ఎఐ ప్రతినిధులతో బుధవారం ఆమె తన ఛాంబర్లో సమావేశమయ్యారు. జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై సమీక్షించారు. ఇప్పటి వరకు ఎంత భూసేకరణ జరిగింది… ఇంకా ఎంత జరగాల్సి ఉంది.. తదితర అంశాలపై ఆర్డీవోను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, సాంకేతిక ప్రక్రియలను పూర్తి చేయాలని ఆర్డీవోకు కలెక్టర్ సూచించారు. నాలుగు ప్యాకేజీల్లో జరుగుతున్న రహదారి నిర్మాణంలో మిగిలిన సాంకేతిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి నిర్ణీత గడువులోగా ఎన్.హెచ్.ఎ.ఐ. సంస్థకు సంబంధిత భూమిని అప్పగించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇప్పటి వరకు సేకరించిన తాలూక భూ యజమానులకు చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎన్.హెచ్.ఎ.ఐ. సంస్థ ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
సమావేశంలో జేసీ కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, ఆర్డీవో భవానీ శంకర్, ఎన్.హెచ్.ఎ.ఐ. ప్రతినిధి సౌరభ్, ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.