All eligible persons should be vaccinated and employment should start immediately. District Collector Smt. Suryakumari Orders
Publish Date : 29/12/2021
అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించాల్సిందే
ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ఆదేశాలు
బొండపల్లిలో గ్రామ సచివాలయాల తనిఖీ
ధాన్యం సేకరణపై ఆరా
విజయనగరం(బొండపల్లి), డిసెంబరు 28 : జిల్లాలో ఉపాధి పనులను వెంటనే ప్రారంభించి ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తిచేసుకొనేలా కార్యాచరణ వుండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మార్చి నెలలోగా పూర్తిచేసిన పనులకే బిల్లులు వస్తాయని అందువల్ల చేపట్టిన పనులను జాప్యం చేయకుండా త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ మంగళవారం బొండపల్లి మండలంలోని గరుడబిల్లి, నెలివాడ గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం పనుల ప్రతిపాదనల గురించి ఆయా సర్పంచ్లతో ఆరా తీశారు. పనులు చేపట్టడంలో జాప్యం వద్దని సూచించారు.
గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ ఒక్కరినీ విడిచిపెట్టడానికి వీల్లేదన్నారు. తొలి డోసు వేసుకున్న వారికి రెండో డోసు వ్యాక్సిన్ వేయడంపై దృష్టి పెట్టాలన్నారు
గ్రామాల్లో ధాన్యం సేకరణకు చేస్తున్న ఏర్పాట్లపై వ్యవసాయ సహాయకులతో ఆరా తీశారు. ఎంతమంది రైతులను ఇ-క్రాప్ నమోదు చేశారు, ఎంతమందికి ఇ-కెవైసి చేశారనే అంశాలపై తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ సహాయకులకు ఎంతమేరకు అవగాహన వుందో తెలుసుకున్నారు. తేమ శాతం లెక్కింపు, ధాన్యం రవాణా తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు చేశారు. వరి ఎంత దిగుబడి వస్తున్నదీ తెలుసుకున్నారు. రబీ సీజనులో ఏ పంటలు వేస్తున్నారు అందుకు తగ్గ ప్రణాళికలు వ్యవసాయ సహాయకులు రూపొందించుకున్నదీ లేనిదీ తెలుసుకున్నారు.
మహిళా పోలీసుల పనితీరుపై కూడా ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల సందర్శన, మహిళలపై నేరాలు వంటి అంశాల గురించి ప్రశ్నించారు. గ్రామాల్లో భూసమగ్ర సర్వేపై తెలుసుకున్నారు. ఈ సర్వేను ఎంతో జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. పశుసంవర్ధక సహాయకులను పశువైద్యంపై ఆరా తీశారు.
సచివాలయాల ద్వారా ప్రజలకు నిర్ణీత వ్యవధిలో సేవలు అందించడంలో చేపడుతున్న చర్యలపై తెలుసుకున్నారు. గ్రామ రెవిన్యూ అధికారుల ద్వారా వినతులు పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఇకపై జాప్యాన్ని నివారించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.