Awareness to farmers on crop rotation system, District Collector Mrs. A. Suryakumari
Publish Date : 09/02/2022
పంటల మార్పిడి విధానంపై రైతులకు అవగాహన
మినీ కోల్డ్ స్టోరేజ్ రూములను గుర్తించండి
టెర్రస్ ఫార్మింగ్ పై శిక్షణ
మామిడి తాండ్రకు ప్రత్యేక బ్రాండ్ నేమ్ తో మార్కెటింగ్ కు ప్రమోట్
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి
విజయనగరం జనవరి, 03: జిల్లాలో పంటల మార్పిడి విధానాన్ని రైతులకు తెలియజేస్తూ ప్రత్యాన్మాయ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబరులో పంటల మార్పిడిపై సంయుక్త కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్, ఐటిడిఎ ప్రోజెక్టు అధికారి కూర్మనాధ్, వ్యవసాయ అనుబంధ శాఖలు ఉద్యాన, భూగర్భ జల, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి, చెరకు పంటలకు బదులుగా ఇతర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు వేసే విధంగా ప్రోత్సహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. మిల్లర్లు, చెక్కర కర్మాగారాలపై ఆధార పడకుండా ఆ పరిస్థితిని నుండి తప్పించడానికి ప్రత్యాన్మాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు. కనీస మద్దతు ధరను మించి మంచి గిట్టుబాటు ధరలు లభించే పంటలు, మార్కెట్ లో అధిక డిమాండ్ ఉండే పంటలపై కేంద్రీకరించాలన్నారు. పూలు, కూరగాయల సాగుతో పాటు వాణిజ్య పంటలు రాగులు, ఉలవలు, మిల్లెట్లు, వేరుసెనగ, నువ్వులు, ఆయిల్ పామ్ లాంటి తదితర పంటలను వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఆయా మండలాలలో వర్షపాతాన్ని నమోదు చేసి గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తరచుగా గ్రామాలలో పర్యటించి రైతులకు పంటల మార్పిడి విధానాలపై తెలియజేయడం, ఆర్.బి.కె.లలో యూట్యూబ్ లలో సేంద్రియ మరియు పంటల మార్పిడి సాగు చేస్తున్న రైతుల విజయగాధలను, ముఖాముఖిలను ప్రసారం చేయాలన్నారు. ప్రతీ విషయాన్ని ప్రాక్టికల్ గా చేసిచూపించాలన్నారు. అదేవిధంగా టెర్రస్ మొక్కల పెంపకంపై కూడా దృష్టిపెట్టి శిక్షణ ఇవ్వాలన్నారు. అనవసర ప్రాంతాలలో వరి వేయకుండా ఉద్యాన పంటలతో పాటు ఓషద మొక్కల పెంపకంపై రైతులను ప్రోత్సహించాలన్నారు. ఐటిడిఎ ప్రాంత మండలాలలో కూడా ప్రత్నాన్మాయ పంటల సాగుపై రైతులలో అవగాహన కల్పించాలని పి.ఓ.కు సూచించారు. నీరు సమృద్దిగా లభించే ప్రాంతాలలో అరటి, ఆయిల్ పామ్ పంటలను వేసే విధంగా చూడాలని, చెరువు, ఆయకట్టు ప్రాంతాలలో కూరగాయలు, నీటి ఎద్దడి వున్న ప్రాంతాలలో రాగులు, నువ్వులు, ఉలవలు లాంటి వాణిజ్య పంటలను వేసే విధంగా చూడాలన్నారు. జీరో బేస్డ్ నేచరల్ ఫార్మింగ్ (జడ్.బి.ఎన్.ఎఫ్) ఫార్మింగ్ పై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లా మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ది గాబట్టి మార్కెట్ లో ప్రమోట్ చేయడానికి మంచి ఆకర్షణీయమైన ప్యాకింగ్, ఒక బ్రాండ్ నేమ్ ను పెట్టి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా చర్యలు చేపట్టాలని, గుర్తింపు ఉన్న పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడి అమ్మకాలు జరిగే విధంగా చూడాలన్నారు. అంతర పంటలలో భాగంగా మామిడి, జీడి, కొబ్బరి మొక్కలతో పాటు సీతాఫలం, జామ, బొప్పాయి, ములగ, అరటి తదితర పంటలను వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ఒకే పంటతో రైతు నష్టపోకుండా తాను పండించే పొలంలో ¼ వంతు భాగంలో ఇతర వాణిజ్య పంటలు చిరుధాన్యాలు, అపరాలు,
నూనెగింజలను వేసుకొనడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకొనే వీలువుంటుందన్నారు.
సంయుక్త కలెక్టర్ డా. జి.సి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ మండలాలలో వర్ష పాత వివరాలను సర్వే చేసి ప్రత్యాన్మాయ లాభదాయక పంటలపై విలేజ్ చార్ట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. మినీ కోల్డ్ స్టోరేజ్ రూములను గుర్తించాలన్నారు.
ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రోజెక్టుఅధికారి ఆర్.కూర్మనాధ్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రామారావు, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎపిఎంఐపి పిడి. లక్ష్మినారాయణ, గ్రౌండ్ వాటర్ డి.డి. నాగమల్లేశ్వరరావు, ఫెర్టిలైజర్లు, ఆర్.బి.కె. డి.డి. ఆనందకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త డా.లక్ష్మీనారాయణ, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.