Better service should be rendered to the people -Collector A. Suryakumari in Secretariat Inspection
Publish Date : 10/02/2022
*ప్రజలకు మెరుగైన సేవలందించాలి*
*సచివాలయ తనిఖీలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 09 ః అంకితభావంతో విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలకు సంబంధించిన ఫలితాలు లబ్ధిదారులకు సజావుగా అందేలా వ్యవహరించాలని సూచించారు. స్థానిక ప్రదీప్ నగర్లోని 41వ వార్డు సచివాలయాన్ని ఆమె బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను, ఫిర్యాదుల పరిష్కార నివేదికను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు త్వరితగతిన హెచ్.బి. పరీక్షలు నిర్వహించాలని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఓటీఎస్, 90 డేస్ ప్రక్రియలో వేగం పెంచాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బంది హాజరు పట్టీలను, ప్రగతి నివేదికలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ వర్మ, తహశీల్దార్ ప్రభాకర్లను సచివాలయానికి రప్పించి పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. గుంకలాం లేఅవుట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ను ఏర్పాటు చేయాలని స్థానిక తహశీల్దార్ను ఆదేశించారు. అలాగే రైస్ కార్డు జారీలో పూర్తి స్థాయి పరిశీలన అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించేందుకు నిర్ణయించిన ఎం.ఐ.జి. ప్లాట్ల నిమిత్తం భూ సేకరణ చేయాలని కమిషనర్ కు సూచించారు. ప్రత్యేక శ్రద్దవహించి త్వరితగతిన భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ వర్మ, తహశీల్దార్ ప్రభాకర్, సచివాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ అశోక్, యు.ఎల్.బి. కో-ఆర్డినేటర్ హరీశ్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.