Priority for resolving public issues * Collector Suryakumari in a review conducted on various topics
Publish Date : 24/02/2022
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత*
*వారి నుంచి వచ్చే వినతులకు సత్వరమే పరిష్కారం చూపాలి
*ఇళ్ల నిర్మాణాలు, ఓటీఎస్ ప్రక్రియల్లో ప్రగతి మెరుగుపడాలి
*జిల్లాల పునర్విభజన ప్రక్రియలో సమన్వయ సేవలు అవసరం
*వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఫిబ్రవరి 23 ః ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అలసత్వం ప్రదర్శించకుండా సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను క్షున్నంగా పరిశీలించి నిర్ణీత వ్యవధిలోగా సహేతుకమైన పరిష్కారం చూపాలని సూచించారు. స్పందన, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, కన్వర్జెన్సీ నిధుల వినియోగం, జిల్లాల పునర్విభజన ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు తక్కువ వ్యవధిలో అందించగలమని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాల ప్రక్రియలో మరింత ప్రగతి కనిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే ఓటీఎస్ ప్రక్రియలో ఆశాజనక ఫలితాలు సాధించాలని సూచించారు. ఇక నుంచి డివిజన్ స్థాయి సమావేశాలు ఇదే మాదిరిగా నిర్వహిస్తామని అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పలు చోట్ల భూమి అప్పగించినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కావటం లేదని సమస్యను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. కన్వర్జెన్సీ పనులకు సంబంధించి ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. రీ-సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని, సరిహద్దుల నిర్ణయంలో జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఈ కేవైసీ విధానంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల నుంచి అవసరమైన వివరాలను ఫార్మెట్ ప్రకారం అందించాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సేవలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని, తగిన శిక్షణా సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, ఆర్డీవో భవానీ శంకర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.