Road Facility to Tribal Villages, District Collector A. Suryakumari
Publish Date : 12/04/2022
24 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 11 ః మారుమూల ప్రాంతాల్లో ఉన్న 24 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికను సిద్దం చేశామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల సుమారు 20వేల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దీనికోసం సుమారు రూ.45.62 కోట్లతో 55 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించడానికి, మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పీడిక రాజన్నదొర, శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, ఎస్.కోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఇతర ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా, ఆయా ప్రాంతాల గిరిజనులు, గిరిజన సంఘాల విజ్ఞప్తుల మేరకు, ఉమ్మడి జిల్లాలో ఈ రోడ్ల నిర్మాణానికి అప్పట్లో ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రహదారులను నిర్మించనున్న భూములకు ప్రత్యామ్నాయంగా ఎస్కోట వద్ద సుమారు 28.1 హెక్టార్ల ప్రభుత్వ భూమిని, అటవీశాఖకు అప్పగించడం జరిగిందని వివరించారు. అటవీశాఖ నుంచి రోడ్ల నిర్మాణానికి అనుమతులు రాగానే, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.