Instead of cultivating rice in Rabi, we will cooperate if we go ahead with the setting up of rice mills.
Publish Date : 13/04/2022
రబీలో వరికి బదులు అపరాలను సాగుచేయాలి
రైస్మిల్లు ఏర్పాటుకు ముందుకు వస్తే సహకరిస్తాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
డెంకాడ మండలంలో కలెక్టర్ పర్యటన
డెంకాడ (విజయనగరం), ఏప్రెల్ 13 ః
రబీలో వరికి బదులు అపరాల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. డెంకాడ మండలం రఘుమండ గ్రామ సచివాలయాన్ని, బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరును, వివిధ ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. జగనన్న గృహనిర్మాణం, ఓటిఎస్ పథకాలపై ఆరా తీశారు. జగనన్న కాలనీలకు వెంటనే విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఓటిఎస్ వినియోగించుకున్నవారికి బ్యాంకులనుంచి రుణాలను ఇప్పించాలని సూచించారు. గ్రామీణ ఉపాధిహామీ పనులపై సమీక్షించారు. సిమ్మెంటు వచ్చేవరకూ ఆగకుండా, వెంటనే గ్రావల్ రోడ్ల పనులను ప్రారంభించాలని సూచించారు. కన్వర్జెన్సీ పనులకు, హౌసింగ్కు బిల్లులు వస్తున్నాయని, అందువల్ల త్వరగా పనులను పూర్తి చేయాలని కోరారు. జగనన్న కాలనీలతోపాటు, ఉపాధి పనులకు కూడా ఇసుక కొరతరాకుండా చూడాలని సూచించారు. వారం నిర్వహించాల్సిన వేక్సినేషన్ కార్యక్రమం, 104 సేవలపై ప్రశ్నించారు. మహిళలు, పిల్లల్లో హీమోగ్లోబిన్ శాతంపై ఆరా తీశారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ వినియోగించేలా చూడాలని, మధ్యాహ్న భోజనంలో గుడ్లు, ఇతర ఆహార పదార్దాల నాణ్యతను తరచూ పరిశీలించాలని గ్రామ సర్పంచ్కు, సిబ్బందికి సూచించారు. గ్రామంలోని రెవెన్యూ పరమైన సమస్యలన్నీ భూముల రీసర్వే తరువాత పరిష్కారం అవుతాయని చెప్పారు. వరికి బదులు అపరాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతు భరోసా కేంద్రం సిబ్బందికి కలెక్టర్ సూచించారు. రైస్మిల్లును ఏర్పాటు చేయడానికి వ్యక్తులు గానీ, సంఘంగానీ ముందుకు వస్తే, ప్రభుత్వపరంగా సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం మిల్లుతోపాటు, పప్పులను కూడా మరపట్టేవిధంగా మిల్లును నిర్మించుకోగలగితే, నష్టాలు ఉండవని సూచించారు. పచ్చిరొట్ట వేయడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని అన్నారు.
గ్రామ శివారులో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో మధ్యతరగతి వారికోసం ప్రతిపాదించిన ఎంఐజి కాలనీ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ స్థలంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ, పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ పి.ఆదిలక్ష్మి, ఎంపిడిఓ డిడి స్వరూపరాణి, హౌసింగ్ డిఇ మురళి, గ్రామ సర్పంచ్ విష్ణు, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.