In Nature Agriculture ….. Low Investment-High Yield District Collector A. Suryakumari Every woman should work Everybody reads Adarsh Village Collector’s visit to Jonavalasa
Publish Date : 30/05/2022
ప్రకృతి వ్యవసాయంలో…..
తక్కువ పెట్టుబడి-అధిక దిగుబడి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ప్రతి మహిళా పనిచేయాలి
ప్రతీఒక్కరూ చదువుకోవాలని పిలుపు
ఆదర్శగ్రామం జొన్నవలసలో కలెక్టర్ పర్యటన
విజయనగరం, మే 27 ః
ప్రకృతి వ్యవసాయంలో, అతితక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. ఈ విధానం ద్వారా పండించిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, కేన్సర్ లాంటి జబ్బులు రాకుండా నిరోధిస్తాయని చెప్పారు. ఒకరిద్దరు కాకుండా, మొత్తం ఊరుఊరంతా ప్రకృతి వ్యవసాయానికి ముందుకు రావాలని ఆమె కోరారు.
విజయనగరం మండలంలోని ఆదర్శగ్రామం జొన్నవలసలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం, వివిధ శాఖల అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. జొన్నవలసపై ప్రత్యేక దృష్టి పెడతామని, గ్రామం అభివృద్దికి పలు హామీలు ఇచ్చారు. ఆమె ముందుగా రాజుల కోనేరును సందర్శించారు. కోనేరు గట్టును బలోపేతం చేసి, వాకింగ్ ట్రాక్ను రూపొందించడం, లోపలి అంచులో రివిట్మెంట్, పిచ్చిమొక్కల తొలగింపు తదితర అభివృద్ది పనులకు వెంటనే ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని ఆదేశించారు. చెత్తనుండి సంపద తయారీ కేంద్రం (ఎస్డబ్ల్యూపిసి)ని సందర్శించారు. సేంద్రీయ ఎరువు తయారీపై ఆరా తీశారు. పెద్ద ఎత్తున ఎరువును తయారుచేసి, రైతులకు విక్రయించాలని సూచించారు. సమీపంలోని వాటర్ ట్యాంకు నుంచి ఈ కేంద్రానికి కొళాయి కనక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. జొన్నవలసను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.
అనంతరం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో, గ్రామ అభివృద్దిపై సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జెడ్పిటిసి కెల్ల శ్రీనివాసరావు, సర్పంచ్ కె.రమాదేవి, ఇతర అధికారులతో మాట్లాడి, గ్రామం అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు సిమ్మెంటు సరఫరా మొదలయ్యిందని, వెంటనే పనులను మొదలు పెట్టాలని సూచించారు. బిల్లులు కూడా వెంటవెంటనే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తిచేసి, డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల ప్లేగ్రౌండ్కు ప్రహరీ నిర్మాణానికి, సబ్ సెంటర్కు కొత్త భవనాన్ని నిర్మించడానికి వెంటనే ప్రతిపాదనలను తయారుచేసి పంపించాలని ఆదేశించారు. చుట్టుప్రక్కల నాలుగైదు గ్రామాలకు కలిపి వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరించాలని సూచించారు. గ్రామంలో అవసరమైతే సామూహిక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, దానికి నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామంలో బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, దానికి అవసరమైన సుమారు 10 సెంట్ల స్థలాన్ని గుర్తించాలని సూచించారు. అవసరమైనవారు గోశాలలు నిర్మించుకోవాలని కోరారు. కాలువలు మరమ్మతు చేయాలని సూచించారు.
బాలురతో సమానంగా, బాలికలను కూడా చదివించాలని, తల్లితండ్రులను కలెక్టర్ కోరారు. బడి ఈడు పిల్లలంతా తప్పనిసరిగా బడికి వెళ్లేలా చూడాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితిలోనూ చదువు మానవద్దని, చదువుకున్నవారికి ఉపాధిని కల్పించేందుకు నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీమహిళా సమయాన్ని వృథా చేయకుండా, కష్టపడాలని, ఏదో ఒక పనిచేయాలని సూచించారు. గ్రామానికి మంజూరుచేసిన 131 ఇళ్ల నిర్మాణం జూన్ నాటికి ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం వారికి పోషకాహారాన్ని అందజేయడంతోపాటు, అవగాహన పెంపొందించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించాలన్నారు. ప్రతీశుక్రవారం శానిటేషన్, దోమల నివారణపై దృష్టి పెట్టాలని కోరారు. గ్రామంలో చెరువులను అభివృద్ది చేయడంతోపాటుగా, గంబూషియా చేపలను వేయడం ద్వారా దోమలను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో మండల ప్రత్యేకాధికారి అరుణకుమారి, డిపిఓ సుభాషిణి, తాశీల్దార్ బంగార్రాజు, ఎంపిడిఓ సత్యనారాయణ, ఏఓ ఎం.ఉమామహేశ్వరనాయుడు, సిడిపిఓ శ్రీదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
