District Collector A. Suryakumari on the occasion of World Environment Day and awareness rallies in many places.
Publish Date : 06/06/2022
ప్రకృతి వనరులను పరిరక్షించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పలుచోట్ల అవగాహనా ర్యాలీలు
విజయనగరం, నెల్లిమర్ల, జూన్ 05 ః
ప్రకృతి వనరులను భావితరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. ఆ దిశగా ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. *ఒకే ఒక్క ధరిత్రి* నినాదంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పర్యావరణంపై అవగాహనా ర్యాలీని, కోట జంక్షన్ వద్ద కలెక్టర్ సూర్యకుమారి ప్రారంభించారు. పిఎస్ఆర్ కాలనీ పార్కువరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం అక్కడ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భవిష్యత్ తరాల మనుగడకు ప్రకృతి వనరుల పరిరక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. వారి భవిష్యత్తును శూన్యం చేయాలనుకోవడం సరికాదని, దీనిపై ప్రతీఒక్కరూ పునరాలోచించాలని సూచించారు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, వారికి కలుషితం లేని చక్కని ప్రకృతిని అందించాలని పిలుపునిచ్చారు. నీరు లాంటి ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టడం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టడం, పేపర్ వాడకాన్ని తగ్గించడం తదితర చర్యల ద్వారా కొంతవరకు ప్రకృతిని పరిరక్షించవచ్చని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ఇసరపు రమాదేవి, ఎపి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ ఛైర్మన్ కేసలి అప్పారావు, మున్సిపల్ కమిషనర్ ఆర్. శ్రీరాములనాయుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, మెప్మా పిడి సుధాకరరావు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు, రామ్మోహన్ తదితర వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో
జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లిమర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద, పర్యావరణ అవగాహనా ర్యాలీని, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ప్రారంభించారు. అనంతరం ఈ గ్రీన్ ర్యాలీ బ్రిడ్జి మీదుగా సికెఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు జరిగింది. సుమారు 2.5 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున మొక్కలను నాటారు. అంతకుముందు విజయనగరం ఎత్తు బ్రిడ్జి నుంచి నెల్లిమర్ల వరకు మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. కళాజాతా బృందం, ఫ్లకార్డులు, నినాదాలతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మున్సిపల్ ఛైర్మన్ బంగారు సరోజిని, వైస్ ఛైర్మన్ సముద్రాల రామారావు, జిల్లా పర్యావరణ ఇంజనీర్ టి.సుదర్శనం, మున్సిపల్ కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, ఇతర మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది, మిమ్స్ డీన్ సిహెచ్.లక్ష్మీకుమార్, ఏఓ గణేష్ ఆధ్వర్యంలో వైద్యవిద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
