Collector A. Suryakumari said that complete literacy will be possible through the Chitti Gurus – 2022 Primary Literacy Program, which is conducted exclusively in the district under the auspices of the Department of Adult Education.
Publish Date : 08/06/2022
చిట్టి గురువులుతో సంపూర్ణ అక్షరాస్యత
*వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయనగరం, జూన్ 07 ః వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నచిట్టి గురువులు – 2022 ప్రాథమిక అక్షరాస్యతా కార్యక్రమం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. పిల్లలే గురువులుగా మారి తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం కల్పించటం మంచి పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని ఫలితాలు వచ్చే విధంగా వయోజన విద్యాశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. చిట్టి గురువులు కార్యక్రమంపై జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. అక్షరాస్యతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, మరింత ప్రణాళికాయుతంగా నిర్వహించాలని సంబంధిత విభాగ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిరక్షరాస్యులను గుర్తించి తగిన ప్రణాళికలు రచించాలని, అవసరమైన విద్యా సామాగ్రి అందజేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణపై సరైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. స్థానికంగా జరిగే పరిపాలనా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలపై నిరక్షరాస్యులు కనీస పరిజ్ఞానం కలిగే స్థాయికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు, ఉపాధి కూలీలకు, స్వయం సహాయ సంఘాల సభ్యులకు 6, 7వ తరగతి చదువుతున్న విద్యార్థుల సహాయంతో అక్షర జ్ఞానం కల్పించేందుకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక విద్యా కమిటీలు నియమించాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వ్యవహరించటం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత దిశగా జిల్లాను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విస్తృత అవగాహన కల్పించి ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. చిన్నారులకు తగిన సహాయ, సహకారాలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డీడీ సుగుణాకర్ రావు, జిల్లా పరిషత్ సీఈవో అశోక్ కుమార్, మెప్మా పీడీ సుధాకర్, డీఈవో జయశ్రీ, ఎస్.ఎస్.ఎ. పీవో స్వామినాయుడు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, డ్వామా పీడీ ఉమాపరమేశ్వరి, డీపీవో సుభాషిణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామానందం తదితరులు పాల్గొన్నారు.
