Close

District Collector A. Surya Kumari directed the zonal level authorities to expedite the construction work being carried out with the funds of the Employment Guarantee Scheme.

Publish Date : 09/06/2022

అభివృద్ధి పనుల వేగం పెంచాలి

డైలీ ప్రోగ్రెస్ పై  డైలీ రిపోర్ట్ ఇవ్వాలి

పది రోజుల్లో పురోగతి కనపడకపోతే చర్యలు తప్పవు

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసిల్దార్లదే

డివిజినల్ స్థాయి అధికారుల సమావేశం లో స్పష్టం చేసిన కలెక్టర్

విజయనగరం, జూన్ 08 :    ఉపాధి హామీ పధకం నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనుల వేగం పెంచాలని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మండల స్థాయి అధికారులకు ఆదేశించారు.  ముఖ్యంగా ఉపాధి నిధులతో  సచివాలయాలు, ఆర్.బి.కే లు, వెల్నెస్  కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల  భవనాలకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. సిసి రోడ్లు, డ్రైనేజ్ లు అవుతున్నప్పటికీ వాటి బిల్లులను తర్వాతే చెల్లించాలని సూచించారు.  బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో విజయనగరం , చీపురుపల్లిలో చీపురుపల్లి   డివిజన్ల కు సంబంధించిన తహసిల్దార్ లు, ఎం.పి.డి.ఓ లు, పంచాయతి రాజ్, ఆర్.డబ్లు.ఎస్ మండల ఇంజనీర్లతో, మెడికల్ అధికార్లతో పలు అంశాల పై సమీక్షించారు. ఇంజనీరింగ్ పనులలో సచివాలయాల ఇంజనీరింగ్ సహాయకులకు లక్ష్యాలను నిర్దేశించాలని  సూచించారు. గృహ నిర్మాణాలు ,   నాడు నేడు పనులు,  ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న భవనాల పనులకు  మెటీరియల్ సమస్య లేదని,  అయినా ఏవేవో కారణాలతో ఆశించిన మేర  పనులు ముందుకు వెళ్ళడం లేదని  ఇంజనీరింగ్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం  చేసారు.  వర్షాలు పడక ముందే పనులు వేగంగా జరగాలని, సరైన ప్రణాళిక వేసుకొని  రాత్రీ పగలు పని జరగాలని ఆదేశించారు. గత వారం ప్రగతి బాగుందని, ఈ వారం పనులు సరిగ్గా జరగలేదని, ఇలాగైతే  పై అధికారులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక పై ప్రతి రోజు ప్రోగ్రెస్ ను రోజు వారీగా రిపోర్టింగ్ చేయాలనీ, ఎక్కడ వెనకబాటు ఉంటె ఆ అధికారులకు ఛార్జ్ మేమో ఇవ్వడం జరుగుతుందని హెచ్చరించారు.  గృహ నిర్మానాలు జూన్ లోపల అన్నీ ప్రారంభం కావాలని, రద్దు చేసి కొత్త లబ్ది దారులకు  మంజూరు చేసినవి వారికీ ఆసక్తి ఉంటేనే ఇవ్వాలని సూచించారు.  ఓ.టి.ఎస్ రిజిస్ట్రేషన్లు   అనేక చోట్ల పెండింగ్ ఉన్నాయని, అందుకు గల కారణాలపై ఆరా తీసారు. ఏ రోజుకారోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు.

        జగనన్న స్వచ్చ  సంకల్పం  కార్యక్రమం పై  ఈ.ఓ.ఆర్.డి లు   ప్రత్యెక దృష్టి పెట్టాలని అన్నారు.  నేషనల్ హై వేస్ కు ఆనుకొని ఉన్న గ్రామాలలో ఎక్కడికక్కడే డంపింగ్ చేసిన చెత్త కనపడుతోందని, దీనిపై డ్రైవ్ నిర్వహించాలని అన్నారు.   పొడి చెత్త సేకరణ, రీసైక్లింగ్, వెర్మి కంపోస్ట్ తదితర అంశాలపై. కూడా దృష్టి పెట్టాలని అన్నారు.

       జిల్లాలో అనేక ప్రాజెక్టులు, రహదారులు రైల్వే లైన్లు  రావడం తో  ప్రభుత్వ భూముల  విలువ ఇతోధికంగా పెరుగుతోందని, ఈ నేపధ్యం లో  ప్రభుత్వ భూములను పరిరక్షించవలసిన బాధ్యత తఃసిల్దార్ల పైనే ఉందని స్పష్టం చేసారు.  స్పందన వినతుల, భూ వివాదాల పరిష్కారం కోసం తఃసిల్దార్లు క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేసి పరిష్కరించాలని సూచించారు. చేసే పని పారదర్శకంగా ఉండాలని, గ్రామ సభలు నిర్వహించి ఎలాంటి వివాదాలకు తావివ్వని విధంగా పరిష్కరించాలని అన్నారు.  రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలనీ అన్నారు.

       వైద్యాధికారులు వారి పరిధి లో జరుగుతన్న కార్యక్రమాల పై దుష్టి పెట్టాలని సూచించారు. సఖి బృందాలను ఏర్పాటు చేసి వారికీ వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ పై, యోగ తరగతులను నిర్వహించడం జరుగుతోందని, వీటిని వైద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గర్భిణీల నమోదు శత శాతం జరిగేలా చూడాలన్నారు.  అదే విధంగా శిశువుల నమోదు కూడా ఎప్పటికప్పుడు జరగాలన్నారు.  సరిగ్గా నమోదు చేయని వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  సీనియర్ అధికారులు పి.హెచ్.సి లను తనిఖీ చేయడం జరుగుతుందని, తేడా వస్తే సహించేది లేదని అన్నారు.

       ఈ సమావేశం లో ఆర్.డి.ఓ భవాని శంకర్, డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి, పంచాయతి రాజ్ ఆర్.డబ్లు.ఎస్. ఎస్.ఈ లు  గుప్తా,శివానంద కుమార్,  హౌసింగ్ పి.డి. రమణ మూర్తి  తదితరులు పాల్గొన్నారు.

District Collector A. Surya Kumari directed the zonal level authorities to expedite the construction work being carried out with the funds of the Employment Guarantee Scheme.