Biometric system resulting in continuous monitoring by the District Collector
Publish Date : 18/06/2022
ఫలితమిస్తున్న బయోమెట్రిక్ విధానం
జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
ప్రజలకు మరింత చేరువైన వైద్యసేవలు
డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్వి రమణకుమారి
విజయనగరం, జూన్ 16 ః వైద్య సేవలు జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసే లక్యంతో, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పలు చర్యలు తీసుకున్నారని, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్వి రమణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్యశాఖలో గత ఏప్రెల్ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ఫలితంగా సిబ్బంది హాజరు శాతం పెరిగిందని తెలిపారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను తరచూ తనిఖీలు చేస్తున్నారని, ఇది గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. కలెక్టర్తోపాటు నిరంతరం సీనియర్ వైద్యాధికారులు, మండల ప్రత్యేకాధికారులు కూడా ఆసుపత్రులను తనిఖీ చేస్తూ, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖలో సుమారుగా 843 మంది సేవలను అందిస్తున్నారని, వీరందరికీ బయోమెట్రిక్ నమోదు చేస్తున్నామని తెలిపారు. పిహెచ్సిలు, సిహెచ్సిలు, జిల్లా కేంద్రాసుపత్రి, జిల్లా కార్యాలయ సిబ్బంది అంతా వీరిలో ఉన్నారని చెప్పారు. కార్యాలయ సిబ్బంది మినహా, వైద్యులు, నర్సులు, ఇతర సాంకేతిక నిపుణులు, సిబ్బంది అంతా ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ నమోదు చేయాల్సి ఉంటుందని, అలాగే సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి బయోమెట్రిక్ వేస్తున్నారని చెప్పారు. దీంతో జిల్లాలో బయోమెట్రిక్ హాజరు సగటున 86శాతం నమోదు అవుతోందని తెలిపారు. దీనిని 90శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఆసుపత్రులకు అవసరమైన మందులు, పరికరాలు ఎప్పటికప్పుడు సరఫరా అవుతున్నాయని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని డిఎంఅండ్హెచ్ఓ చెప్పారు.
