Teachers need guidance, instill self-confidence in students, a two-day training program for District Collector A. Suryakumari, KGBV teachers
Publish Date : 25/06/2022
ఉపాధ్యాయులు మార్గదర్శకులు కావాలి
విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కెజిబివి టీచర్లకు రెండురోజుల శిక్షణా కార్యక్రమం
విజయనగరం, జూన్ 24 ః
ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా మారాలని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. విద్యార్థులను, వారి ద్వారా సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఆమె స్పష్టం చేశారు. స్థానిక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో, సమగ్ర శిక్ష, ట్రైబల్ యూనివర్సిటీ సంయుక్తంగా కెజిబివి ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులు వృధ్దిలోకి వస్తే, తల్లితండ్రులకంటే ఎక్కువగా ఉపాధ్యాయులే సంతోషిస్తారని అన్నారు. విద్యార్థులు తమ తల్లితండ్రులతో కంటే, ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతారని, వారిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని అన్నారు. ప్రాధమిక విద్య ఎంతో కీలకమని, చిన్నతనంలో వారి మనసుపై వేసే బలమైన ముద్ర, జీవితాంతం ఉంటుందని అన్నారు. విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి, వాటిని తొలగించేందుకు కృషిచేయాలని కోరారు. ముఖ్యంగా బాలికలపట్ల మరింత జాగ్రత్త వహించాలని, ప్రస్తుత సమాజ పోకడలపట్ల, చెడు ప్రవర్తనల వల్ల కలిగే దుష్పరిణామాలపట్లా, వారికి చైతన్యం కల్గించాలని కోరారు. కెరీర్ గైడెన్స్కే పరిమితం కాకుండా, వారికి జీవితంలో ఉపయోగపడే వివిధ అంశాలను తెలియజేయాలని సూచించారు. విద్యార్థులపై ఎంతో ప్రభావాన్ని చూపించే ఉపాధ్యాయ వృత్తి ఆషామాషీ కాదని పేర్కొన్నారు. విద్యార్థులను, ఉన్నత వ్యక్తిత్వం గలవారిగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.
ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ గంటా రమేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ వృద్ది చెందుతోందని, వాటికి తగ్గట్టుగా విద్యావ్యవస్థలో మార్పులు చోటుచేసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మార్పులకు అనుగుణంగా విద్యాబోథన జరగాలంటే, కనీసం మూడేళ్లు లేదా ఐదేళ్లకొకసారైనా ప్రతీ ఉపాధ్యాయునికీ, 21 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులనుంచి సమాజం చాలా ఎక్కువ ఆశిస్తుందని, వ్యవస్థలోని లోపాలకు కూడా ఉపాధ్యాయున్నే బాధ్యుణ్ణి చేస్తుందని అన్నారు. అందువల్ల ఉపాధ్యాయువృత్తి ఎంతో గౌరవప్రదమైనదే కాకుండా, సమాజంలో చాలా కీలకమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం అధ్యయనం ద్వారా, తమ సామర్ధ్యాన్ని మెరుగుపర్చుకున్నప్పుడు మాత్రమే, మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యాబోధన చేయగలని స్పష్టం చేశారు. అందుకు ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ వి.ఏ.స్వామినాయుడు, ట్రైబల్ యూనివర్సిటీ ఏఓ డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ, సమగ్ర శిక్ష సిబ్బంది, కెజిబివి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
