Cancellation of houses which have not started construction, Convergence works should be started immediately, Special focus on Rajam constituency, District Collector A. Suryakumari
Publish Date : 24/05/2022
నిర్మాణం ప్రారంభించని ఇళ్లు రద్దు
కన్వర్జెన్సీ పనులను వెంటనే మొదలు పెట్టాలి
రాజాం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, మే 23 ః నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని అధికారులను, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రాధాన్యతలకు అనుగుణంగా వెంటనే మొదలు పెట్టాలని సూచించారు. ఉపాధి కన్వర్జెన్సీ పనులు, గృహనిర్మాణంపై వివిధ శాఖల అధికారులతో తన ఛాంబర్లో సోమవారం సమీక్షా సమావేశాన్ని, రాజాం నియోజకవర్గంలోని మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ను నిర్వహించి, పలు ఆదేశాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి వేతనదారులకు పని కల్పించడంతోపాటు, కన్వర్జెన్సీ పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. వేతన దారులకు గరిష్టస్థాయిలో పని కల్పించడంతోపాటుగా, సగటు వేతనం ఎక్కువగా వచ్చేవిధంగా పనులను నిర్వహించాలని సూచించారు. కన్వర్జెన్సీ పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి, ప్రాధాన్యతలకు అనుగుణంగా పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రావెల్ రోడ్ల పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. అలాగే సిసి రోడ్లు, డబ్ల్యూబిఎం రోడ్లు, కాలువలు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, ఎస్డబ్ల్యూపిసిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి, అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంధ్రలో భాగంగా ఎస్డబ్ల్యూపిసి ల నిర్మాణం అన్ని చోట్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఉపాధి పనుల నిర్వహణలో రాజాం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంపై మండలాల వారీగా సమీక్షించారు.
ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని ఇళ్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సుమారు 16వేలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందని, వీటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని, లేదంటే రద్దు చేయాలని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ పనులపై సమీక్షిస్తూ, ఈ పనులను సకాలంలో పూర్తి చేసి, ఇంటింటికీ కొళాయి సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. మిగిలినచోట్ల కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. జలకళ పథకం క్రింద వేసిన బోర్లకు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా పిడి జి.ఉమాపరమేశ్వరి, హౌసింగ్ పిడి ఎస్వి రమణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానందకుమార్, పంచాయితీరాజ్ ఇఇ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
