Collector who inspected the warehouses,E.V.M. Inquire about the development work
Publish Date : 05/11/2021
ఇ.వి.ఎం. గిడ్డంగులు తనిఖీ చేసిన కలెక్టర్
అభివృద్ధి పనులపై ఆరా
విజయనగరం(నెల్లిమర్ల), నవంబరు 03; జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి బుధవారం నెల్లిమర్లలో పర్యటించారు. స్థానికంగా వున్న ఇ.వి.ఎం.గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి నెలవారీ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోడౌన్ల సీలు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం తనిఖీ రిజిస్టరుపై సంతకం చేశారు. మునిసిపల్ వైస్ ఛైర్మన్ సముద్రపుర రామారావు, సిపిఐ నాయకుడు తాలాడ సన్నిబాబు, లోక్సత్తా తరపున రావి పద్మావతి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, తహశీల్దార్ రమణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆరా
నెల్లిమర్ల పట్టణం, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆసుపత్రి పనులు ఎంతవరకు వచ్చాయని కలెక్టర్ వారిని ప్రశ్నించారు. ప్రభుత్వం కొంత సమయం పట్టినా నిధులు తప్పక విడుదల చేస్తుందని, బిల్లులు వస్తాయని ఆసుపత్రి నిర్మాణం పనులను జాప్యం చేయవద్దని కలెక్టర్ సూచించారు. మునిసిపాలిటీలో ఎం.ఐ.జి.ప్లాట్లకు ఎంతవరకు డిమాండ్ వుంటుందని తెలుసుకున్నారు. జగనన్న గృహహక్కు పథకంపై ప్రజలు, లబ్దిదారుల్లో ఏమేరకు అవగాహన వుందో తెలుసుకున్నారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటరులో ప్రసూతి వైద్యుని పోస్టును భర్తీ చేయాలని మునిసిపల్ వైస్ ఛైర్మన్ రామారావు, సిపిఐ నేత సన్నిబాబు కోరారు. దీనివల్ల నెల్లిమర్ల ప్రాంతంలో ఎంతో మంది ప్రసూతి మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిపై పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.
