Construction of houses should be completed within two months, engineering assistants should be responsible, Collector Suryakumari reviewed immediate water, electricity supply and housing in the surrounding colonies.
Publish Date : 29/03/2022
రెండు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి
ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాలి
జగనన్న కాలనీల్లో తక్షణమే నీరు, విద్యుత్ సదుపాయం
గృహనిర్మాణంపై సమీక్షించిన కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, మార్చి 28 ః ఇళ్ల నిర్మాణానికి ఇదే అనుకూల సమయమని, మంజూరైన అన్ని ఇళ్లనూ రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మే తరువాత వర్షాలవల్ల వాతావరణం సహకరించకపోవచ్చునని, అందువల్ల ప్రతీ లబ్దిదారుణ్ణీ చైతన్య పరిచి, వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు. గృహనిర్మాణ కార్యక్రమంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో వివధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జగనన్న కాలనీలు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంపై మండలాల వారీగా ప్రగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకం ప్రకారం మంచి ముహూర్తాలు కూడా మొదలయ్యాయని, వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాలని సూచించారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణ కార్యక్రమంపై శ్రద్దపెట్టి, మరింత బాధ్యత వహించాలని ఆదేశించారు. ప్రతీ లబ్దిదారుడినీ కలిసి, వారిని చైతన్యపరిచి, వెంటనే మార్కింగ్ చేసి, నిర్మాణాన్ని ప్రారంభింపజేసే బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్పైనా ఉందన్నారు.నిర్మాణం సాగుతున్న ఇళ్ల ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వారం వారం ప్రగతి కనిపించకపోతే, హౌసింగ్ ఏఈలతోపాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్లపైనా చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. నిధులు సిద్దంగా ఉన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. హౌసింగ్ కాలనీలతోపాటు, కొన్నిచోట్ల వ్యక్తిగత ఇళ్లను కూడా మొదలు పెట్టకపోవడానికి కారణాలపై ఆరా తీశారు. మంజూరైన ప్రతీ ఇళ్లూ కట్టి తీరాల్సిందేనని, లేకపోతే రద్దుచేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలపై సమీక్షిస్తూ, కాలనీల నిర్మాణం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాలనీల్లో నిర్మాణానికి వీలుగా తక్షణమే నీరు, విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. గృహనిర్మాణానికి నిధులతోపాటు ఇసుక, సిమ్మెంటు కొరత లేదని, ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, హౌసింగ్ పిడి కూర్మినాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానందకుమార్, హౌసింగ్ ఇఇలు ఎన్వి రమణమూర్తి, వి.శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఇఇ యడ్ల గోవిందరావు, హౌసింగ్ డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.