District Collector A. Suryakumari ordered to pay more attention to high risk pregnant women suffering from anemia and various diseases. A death audit was conducted on Friday evening in the collectorate auditorium on maternal and child deaths.
Publish Date : 30/07/2022
పిల్లలకు నాటుమందులు పట్టకూడదు
హైరిస్క్ గర్భిణులపట్ల మరింత శ్రద్ద చూపాలి
సఖి గ్రూపులకు త్వరలో అవగాహనా సదస్సులు
ఫోర్టిఫైడ్ రైస్ కూడా పాతబియ్యమే
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జులై 29 ః రక్తహీనత, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న హైరిస్క్ గర్భిణులపట్ల మరింత శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం డెత్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరిగిన మాతృ, శిశు మరణాలకు, ఆయా కేసుల వారీగా వైద్యులను, ఇతర సిబ్బందిని ప్రశ్నించి, కారణాలను, వైద్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు, అవగాహనా లోపం, రక్త హీనత, బరువు తక్కువగా ఉండటం, తగిన జాగ్రత్తలను పాటించకపోవడం, ఇతరత్రా కారణాలతో మాతృ, శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. వీటిని అరికట్టడానికి, బాలింతలు, గర్భిణులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. దీనిలో ఎఎన్ఎంలు, అంగన్వాడీలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. డాక్టర్ల సలహా లేనిదే చంటిపిల్లలకు సొంత వైద్యం, నాటుమందులు, రకరకాల అరుకులను ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టకూడదని సూచించారు. దీనిపై బాలింతలకు తగిన అవగాహన కల్పించాలని కోరారు. త్వరలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వల్ల వైద్య సేవల్లో చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
సఖి గ్రూపులకు శిక్షణ
సఖి గ్రూపులకు త్వరలో అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ల వారీగా వీటిని నిర్వహించి, వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, తమ కాళ్లమీద తాము నిలబడే విధంగా వారిలో ఆత్మవిశ్వాశాన్ని నింపడం, వివిధ ప్రాపంచిక విషయాలను బోధించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ అలవాటు చేసే విధంగా శిక్షణ ఉండాలన్నారు. దీనికోసం జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఉమెన్ పోలీసులు, మెప్మా, డిఆర్డిఏ సిబ్బందిని వినియోగించాలని సూచించారు. విజయవంతమైన గాథలను వివరించడం, గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం ద్వారా వారిలో స్ఫూర్తిని నింపవచ్చని అన్నారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే సర్వే జరిగిందని, గుర్తించిన వారందరినీ ఏదోవిధంగా తిరిగి చదువుకొనేలా చూడాలన్నారు.
