District Collector Mrs. A. Suryakumari directed the authorities to provide all the infrastructure to the airport occupants.
Publish Date : 25/03/2022
ఎయిర్పోర్టు నిర్వాసితులకు మౌలిక వసతులు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
భోగాపురం (విజయనగరం), మార్చి 22 :
విమానాశ్రయ నిర్వాసితులకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని మంగళవారం సాయంత్రం కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం పరిశీలించి, నిర్వాసిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో మొత్తం 241 ఇళ్లను నిర్మిస్తున్నట్లు నిర్వాసితులు తెలిపారు. తమకు ఆంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
దీనిపై కలెక్టర్ తక్షణమే స్పందిస్తూ, అయిదు సెంట్ల స్థలాన్ని ఆంగన్ వాడీ భవనం కోసం కేటాయించాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. నిర్వాసిత కాలనీల్లో త్రాగునీరు, విద్యుత్, రోడ్లు, కాలువలు తదితర అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిందువులకు, క్రిస్టియన్ లకు వేర్వేరు స్మశాన వాటికలు నిర్మిస్తామని తెలిపారు. కాలనీలో ఇళ్ల నిర్మాణం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో భోగాపురం తాశీల్దార్ రమణమ్మ, పీఆర్ డిఇ బంగారునాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.
