District Collector Mrs. A. Suryakumari directed to expedite the Convergence works and to spend Rs. 25 crore per day.
Publish Date : 15/03/2022
రోజుకు రూ.25కోట్లు ఖర్చు చేయాలి
పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కన్వర్జెన్సీ నిధుల వినియోగంపై సమీక్ష
విజయనగరం, మార్చి 14 ః
కన్వర్జెన్సీ పనులను వేగవంతం చేయాలని, రోజుకు రూ.25కోట్లు వరకు ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఇప్పటికైనా పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కన్వర్జెన్సీ పనులపై, కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం సమీక్షించారు. ఇంకా సుమారు రూ.208 కోట్ల రూపాయలను ఈ నెలాఖరులోగా ఖర్చు చేయాల్సి ఉందని, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జి.ఉమాపరమేశ్వరి చెప్పారు. అనంతరం శాఖలవారీ లక్ష్యాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, పనులు వేగవంతం చేయకపోతే, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రారంభించకపోతే, అది సంబంధిత మండల ఎఇ వైఫల్యంగా భావిస్తామని, అతనిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇంతవరకు ప్రారంభించని పనులను రద్దుచేసి, వేరే మండలానికి కేటాయించేందుకు వెనుకాడబోమని, దానికి ఏఈలే బాధ్యత వహించాలని చెప్పారు. ఐదు పనులకంటే తక్కువ చేసిన ఏఈలకు మెమోలను జారీ చేయాలని ఆదేశించారు. పగలూ రాత్రి కష్టపడి పనిచేయాలని, పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నిధులకు ఇబ్బంది పడుతున్న ప్రస్తుత తరణంలో, ఉన్న నిధులను వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సిమ్మెంటుకు ఇబ్బంది ఉన్న నేపథ్యంలో,వెంటనే గ్రావెల్ రోడ్లు, డబ్ల్యూబిఎం రోడ్లు, బిటి రోడ్లు, ఇరిగేషన్ పనులు, మినీ గోకులాలు, పేరాపెట్ వాల్స్, ఫాల్జి బ్రిక్ వర్క్, వాకింగ్ ట్రాక్లు, ప్లే గ్రౌండ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ రోజువారీ లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించడానికి కృషి చేయాలని, అందుబాటులో ఉన్న కన్వర్జెన్సీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్ఇ గుప్తా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కెవి శివానందకుమార్, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.