District Collector Smt. A. Suryakumari directed to make arrangements for pulse polio to be conducted on 23,24,25 of this month.
Publish Date : 04/01/2022
23 నుంచి పల్స్ పోలియో
పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం
విజయనగరం, జనవరి 03 ః ఈ నెల 23,24,25 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియోకి పకడ్భందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. మూడురోజలుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో శతశాతం లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
జిల్లా పల్స్పోలియో టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో సో్మవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో నివారణకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. పల్స్పోలియోపై మండలాల వారీగా, సచివాలయాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 1650 పోలియో బూత్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వలస కూలీలు, అసంఘిటిత కార్మికులపై దృష్టి పెట్టాలన్నారు. రైల్వే స్టేషన్, బస్స్టాండులు, ఆటోస్టాండుల్లో కూడా పోలియో బూత్లను ఏర్పాటు చేయాలన్నారు. మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్స్ పోలియోపై ప్రజాప్రతినిధులను ముందుగానే సిద్దం చేయాలని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో వారిని కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఇన్ఛార్జ్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎల్.రామ్మోహనరావు, డిఐఓ డాక్టర్ నారాయణ, మండల ప్రత్యేకాధికారులు, టాస్క్ఫోర్స్ కమిటీ ఇతర సభ్యులు పాల్గొన్నారు.
