District Collector Suryakumari, who met with academics, said it was a great platform for students to benefit from the golden future * * through internship.
Publish Date : 18/06/2022
*ఇంటర్నెషిప్ ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు*
*ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఇదొక చక్కని వేదిక
*విద్యావేత్తలతో సమావేశమైన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూన్ 14 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రత్యేక ఇంటర్నెషిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. సాధారణ డిగ్రీతో పాటు ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో దశల వారీగా చేపట్టబోయే ఇంటర్నెషిప్ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయని, చదువు పూర్తవ్వగానే తక్షణ ఉపాధి లభిస్తుందని అన్నారు. మూడు దశల వారీగా మొత్తం 10 నెలల పాటు అందించే ఇంటర్నెషిప్ కార్యక్రమ ప్రవేశంపై, అమలు చేసే విధానాలపై ఆమె మంగళవారం విద్యారంగ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థులను మరింత ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో భాగంగా ప్రవేశ పెడుతున్న ఇంటర్నెషిప్ కార్యక్రమం ద్వారా ఆశించిన ఫలితాలు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో నైపుణ్యతను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తక్షణ ఉపాధిని పొందే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. వీలైనంత మందికి ఇంటర్నెషిప్ అవకాశం కల్పించాలని కోరారు. విద్యార్థులకు థియరీ నాలెడ్డే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లా కమిటీ ఉంటుందని, నోడల్ ఆఫీసర్లు ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్థానికంగా ఉండే కంపెనీల్లో, సంస్థల్లో విద్యార్థులకు ఇంటర్నెషిప్ అవకాశం కల్పించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అందరూ పని చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ఇంటర్నెషిప్ కార్యక్రమం లక్ష్యాలను, ఉద్దేశాలను, విధివిధానాలను వివరించారు.
ఈ సందర్భంగా విద్యావేత్తలు పలు సూచనలు, సలహాలు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ డీఎం పాపారావు, కలక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.