Excited enthusiasm.. Vadawadala flag ceremony, three-pointed flag fluttering on the streets of Vijayanagara, lively Harghar Tiranga Utsava rallies, hundreds of students from different schools, students, ethnic unity, Chatamari Suryasemanna Collector A.
Publish Date : 12/08/2022
ఉప్పొంగిన ఉత్సాహం.. వాడవాడలా పతాక సంబరం
*విజయనగరం వీధుల్లో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా
*ఉత్సాహంగా సాగిన హర్ ఘర్ తిరంగా ఉత్సవ ర్యాలీలు
*వందలాదిగా విచ్చేసిన వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు
*జాతి సమైక్యతను చాటి చెప్పాలన్న కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విజయగనరం, ఆగస్టు 12 ః భారత్ మాతాకీ జై అనే నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగిపోయాయి. మువ్వెన్నల జెండా రెపరెపలతో వర్ణశోభితంగా మారాయి. స్వతంత్రం.. స్వతంత్రం అంటూ సాగిన ర్యాలీలు పుర ప్రజల్లో స్ఫూర్తి నింపాయి. ఆజాదీ కా అమృత్ మహోత్స్వ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు చేపట్టబోయే హర్ఘర్ తిరంగా ఉత్సవ నేపథ్యంలో శుక్రవారం నగరంలో నిర్వహించిన ర్యాలీలు ఉత్సాహంగా సాగాయి. వివిధ పాఠశాలల నుంచి మొదలైన ర్యాలీలు నగరంలోని గురజాడ జంక్షన్ వద్దకు చేరుకున్నాయి. వందలాదిగా వచ్చిన విద్యార్థులతో గురజాడ జంక్షన్ కిక్కిరిసిపోయింది. వారు చేసిన నినాదాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. విద్యార్థినీ, విద్యార్థులు నిర్వహించి సాంస్కృతిక ప్రదర్శనలు స్ఫూర్తి నింపాయి.
జాతి సమైక్యతను చాటి చెప్పాలి
ముఖ్య అతిథిగా కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. దేశం గర్వించేలా బ్రతకాలని.. జాతి సమైక్యతను చాటి చెప్పాలని హితవు పలికారు. ఎదుట వ్యక్తి మనల్ని చూసి గర్వించేలా ఉండాలని, స్ఫూర్తి పొందేలా జీవించాలని పేర్కొన్నారు. మనల్ని కనీ, పెంచిన తల్లిదండ్రుల, పుట్టిన దేశం తాలూక రుణం తీర్చుకోవాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల అనంతరం జెండాను జాగ్రత్తగా తీసి పదిల పరచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌర్వపరచకూడదని సూచించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు స్ఫూర్తిదాయక ప్రదర్శనలు నిర్వహించి అందరినీ అలరించారు.
కార్యక్రమంలో విజయనగరం మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శ్రావణి, రేవతీ దేవి, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, మెప్మా పీడీ సుధాకర్, యువజన అధికారి విక్రమాధిత్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి రమేశ్, డీఎస్డీవో అప్పలనాయుడు, వివిధ పాఠశాలల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
