Focus on infrastructure in hostels Bridge course for those who do not go to school due to Covid-District Collector A. Surya Kumari
Publish Date : 05/11/2021
వసతి గృహాల్లో మౌలిక వసతుల పై దృష్టి పెట్టాలి
కోవిడ్ కారణంగా బడికి వెళ్లని వారికోసం బ్రిడ్జి కోర్స్ నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, నవంబర్ 03:: సంక్షేమ వసతి గృహాల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాలన్ని ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. ఎక్కడైనా ఈ వసతులు లేని హాస్టళ్లు, పాఠశాలలు ఉంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో విద్య, పాఠశాలల్లో అడ్మిషన్లు, వసతి గృహాలు నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాల పై సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా.మహేష్ కుమార్ తో కలసి, సంబంధిత అధికారులతో సమీక్షించారు. వసతి గృహాలలో విద్యార్థుల నమోదు పై ఆరా తీశారు. కోవిడ్ కారణంగా కొంత మంది విద్యార్థులు హాస్టల్స్ నుండి ఇళ్లకు వెళ్లిపోయారని, ఇప్పటికి తిరిగి రానందున కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ డి డి సునీల్ రాజ్ కుమార్, బి.సి సంక్షేమ అధికారి కీర్తి కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ వలన తరగతులకు హాజరు కాని వారికోసం ట్యూటర్లతో బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. బడి బైట ఉన్న వారిని గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. కోవిడ్ తో తల్లి తండ్రులు మరణించిన వారి పిల్లల్ని గుర్తించి కె.జి.బి.వి ల్లో, వసతి గృహాల్లో చేర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి టిసి లు ఇవ్వడానికి కొన్ని పాఠశాలలు నిరాక రిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పూర్తిగా ఫీజులు చెల్లిస్తేనే టిసి ఇస్తామని అంటున్నారని ఫిర్యాదు లు అందుతున్నాయని , అలాంటి పాఠశాలల పై చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు లేఖను రాయాలని డి.ఈ.ఓ కు సూచించారు. చీపురుపల్లి ప్రభుత్వ కళాశాలలో బాలికల, మహిళల కోసం కొత్తగా వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దూర ప్రాంతాల నుండి వచ్చే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రచారం చేయాలని కలెక్టర్ తెలిపారు.
స్వేఛ్చ పధకం క్రింద బాలికలకు ప్రభుత్వం అందజేస్తున్న సానిటరీ నాప్కిన్స్ అందరికీ సకాలం లో అందుతున్న దీ లేనిదీ ఆరా తీశారు. కోవిడ్ కారణంగా మూసి వేసిన క్రీడా పాఠశాలను తెరవాలని ఆదేశించారు. క్రీడా పాఠశాలలో అన్ని రకాల వసతులు, కోచ్ లు ఉన్నారని, అయితే అకాడమిక్ కోసం మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. నవంబర్ లో ఉద్యోగులకు క్రీడల పోటీ లను నిర్వహించడానికి ఏర్పాట్లు గావించాలన్నారు.
ఈ సమావేశం లో సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి స్వామి నాయుడు, డిప్యూటీ డి.ఈ.ఓ, సీనియర్ కోచ్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.