Girls should also be educated to a degree, District Collector A. Suryakumari Distributed zero interest of Rs. 79 lakhs to women
Publish Date : 29/04/2022
ఆడపిల్లలను కూడా డిగ్రీవరకు చదివించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
మహిళలకు రూ.79లక్షల సున్నావడ్డీ పంపిణీ
నెల్లిమర్ల (విజయనగరం), ఏప్రెల్ 29 ః
బాలురతోపాటు బాలికలను కూడా కనీసం డిగ్రీవరకు చదివించాలని, మహిళలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. మంచి చెడుల గురించి విచక్షణ కలగాలంటే, చదువు చాలా అవసరమని ఆమె స్పష్టం చేశారు. నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు, రూ.79.82 లక్షల విలువైన సున్నా వడ్డీ చెక్కును, ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు.
స్థానిక నగరపంచాతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆడపిల్లలకు చదువు ఆవశ్యకతను వివరించారు. విచక్షణా జ్ఞానం కలగాలంటే, చదువు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఇంటిని నిర్మించుకోవాలని కోరారు. 90 రోజుల పథకం ప్రకారం అర్హలందరికీ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ను పొదుపుగా వాడాలని, సోలార్ పరికరాలను, విద్యుత్ను తక్కువగా వినియోగించే పరికరాలను వాడాలని సూచించారు. మహిళలు, పిల్లల్లో రక్తశాతం పెరగాలంటే, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని వినియోగించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం, ఒక్కో కిలోకు సుమారు రూ.35 ఖర్చు చేస్తోందని, థాలసీమియా వ్యాధి ఉన్నవారు మినహా మిగిలిన వారంతా ఈ బియ్యాన్ని తప్పనిసరిగా ఈ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవాలని సూచించారు. గర్భిణులు ఆలస్యం చేయకుండా 12 వారాల్లోపే అంగన్వాడీ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. దీనివల్ల సకాలంలో అవసరమైన మందులను, పోషకాహారాన్ని పొందే అవకాశం కలుగుతుందని, తద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ చెప్పారు.
నెల్లిమర్ల శాసన సభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ పేదవాని ఇంటికీ కనీసం రూ.30వేలు నుంచి గరిష్టంగా రూ.2.60 లక్షల వరకు లబ్ది చేకూర్చామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడుగడుగునా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుంటే, రాష్ట్రం శ్రీలంకలా మారిపోతోందంటూ, తమ అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అమలవుతున్నాయని, కేవలం ఇక్కడ మాత్రమే ఉన్నట్లు చిత్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలను నివారించేందుకు అన్నిరకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని, దానిలో భాగంగా సోలార్ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ బంగారు సరోజిని, వైస్ ఛైర్మన్లు సముద్రపు రామారావు, కె.కృష్ణ, కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్, మెప్మా పిడి సుధాకరరావు, తాశీల్దార్ రమణరాజు, కోఆప్షన్ సబ్యులు చిక్కాల సాంబ, పలువురు ఇతర నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.