Grain should be procured immediately Complete construction of houses by March District Collector A. Suryakumari
Publish Date : 06/01/2022
త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
మార్చిలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయండి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, జనవరి 06 ః
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసి, రైతులకు సకాలంలో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయనగరం మండలంలోని సారిక, జొన్నవలస రైతు భరోసా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
సారిక ఆర్బికెలో రైతులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్బికెలో టెక్నికల్ అసిస్టెంట్ లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణపై వివరాలను తెలుసుకున్నారు. ధాన్యం ఇచ్చిన 25 మంది రైతులకు డబ్బులు సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జొన్నవలస ఆర్బికెని సందర్శించారు. ధాన్యం కొనుగోలుపైనా, రోజువారీ షెడ్యూల్పైనా సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతీరోజూ వీలైనంత ఎక్కువగా మంది రైతులనుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. గోనెసంచుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యంలో తేమశాతంపై ఆరా తీశారు. స్వయంగా ధాన్యాన్ని పరిశీలించి, నాణ్యతపట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. నాణ్యమైన ధాన్యాన్ని సార్టెక్స్ మిల్లులకు పంపించాలని సూచించారు. వీలైనంత వేగంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
లేఅవుట్లను పరిశీలించిన కలెక్టర్
సారికలో జగనన్న కాలనీలను కలెక్టర్ సూర్యకుమారి పరిశీలించారు. ఈ లేఅవుట్లో మొత్తం 181 ప్లాట్లను రూపొందించగా, 93 ప్లాట్లను పంపిణీ చేశారు. వీటిలో 81 ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా, మిగిలిన 12 ఇళ్ల నిర్మాణాన్ని వారం రోజుల్లో ప్రారంభింపజేయాలని ఆదేశించారు. కాలనీలోకి వెళ్లే ఎప్రోచ్ రోడ్డు బాగులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఇసుక, సిమ్మెంటు సరఫరాపైనా, విద్యుత్, నీటి సదుపాయాలపైనా ఆరా తీశారు. మార్చి వరకు బిల్లులకు ఇబ్బంది ఉండదని, నిధులు సిద్దంగా ఉన్నాయని, ఈ లోగా ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇసుక, సిమ్మెంటు తదితర నిర్మాణ సామగ్రికి కూడా కొరత లేదన్నారు. నిర్మాణాలకు ఇదే అనుకూల సమయమని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం గ్రామానికి సమీపంలో పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన భూమిని పరిశీలించారు. ఎవెన్యూ ప్లాంటేషన్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, జిల్లా సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.