Ideal for other villages Nandigam District Collector A. Suryakumari lauded the development programs and congratulated Sarpanch.
Publish Date : 25/05/2022
ఇతర గ్రామాలకు ఆదర్శం నందిగాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
అభివృద్ది కార్యక్రమాలపై ప్రశంసలు
సర్పంచ్ను అభినందించిన కలెక్టర్
భోగాపురం (విజయనగరం), మే 24 ః
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసిన భోగాపురం మండలం నందిగాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సందర్శించారు. ఆమె మంగళవారం గ్రామంలో పర్యటించి, అభివృద్ది కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సర్పంచ్ మురళీమోహన్ ను అభినందించారు. గ్రామ అభివృద్దికి జిల్లా యంత్రాంగం తరపున మరింత సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
*ఎస్డబ్ల్యూపిసి పనితీరు భేష్*
కలెక్టర్ సూర్యకుమారి ముందుగా నందిగాం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. నాడూ-నేడు క్రింద చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు. పాఠశాలను అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దినందుకు అభినందించారు. గ్రామానికి ఆనుకొని ఉన్న చెత్తనుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తడిచెత్త, పొడిచెత్తను ఎప్పటికప్పుడు వేరు చేయడం, తడిచెత్తనుంచి సేంద్రీయ ఎరువును తయారు చేసి విక్రయించే ప్రక్రియ విజయవంతంగా చేపట్టినందుకు ప్రశంసించారు. మరింత ఎక్కువగా ఎరువును తయారు చేసి, రైతులకు విక్రయించాలని సూచించారు. ఈ ఎరువుతో పండించిన పంటలు ఆరోగ్యదాయకమని, గ్రామానికే కాకుండా సమాజాని ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. గ్రామంలోని రైతుకు ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువు బస్తాను కలెక్టర్ అందజేశారు. పశువుల కోసం గ్రామంలో గోశాలలు నిర్మించుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద వీటిని మంజూరు చేస్తామని సూచించారు.
*సంతృప్తికరంగా ఇళ్ల నిర్మాణం*
గ్రామంలోని జగనన్న కాలనీని కలెక్టర్ సందర్శించారు. మంజూరైన 38 ఇళ్లకు గాను, 35 ఇళ్లు నిర్మాణంలో ఉండటం, అవన్నీ దాదాపు పూర్తి అయ్యే దశలో ఉండటంతో, ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు మంజూరు కాకుండా మిగిలిపోయిన అర్హులకు, కొత్తగా ఇళ్లు మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలతో మాట్లాడి, వారి అభ్యసనా స్థాయిని తెలుసుకున్నారు. వారి ఎత్తు, బరువును తనిఖీ చేయించారు. వారికి అందజేస్తున్న పోషకాహారంపై ఆరా తీశారు. కొత్త అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. గ్రామంలో భూగర్భ జలాలకు కొరత రాకుండా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను కలెక్టర్ పరిశీలించారు. ఇలాంటి ప్రత్యేక నిర్మాణాన్ని చేసినందుకు సర్పంచ్ మురళీ మోహన్ ను అభినందించారు. గ్రామానికి చెందిన విజయదుర్గ మహిళా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. వారి ఉత్పత్తులపైనా, మార్కెట్ సదుపాయాలపైనా ఆరా తీశారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ వినియోగించాలని ఈ సందర్భంగా మహిళలకు కలెక్టర్ సూచించారు.
*డిజిటల్ అక్షరాస్యత అవసరం*
ప్రతీఒక్కరికీ డిజిటల్ అక్షరాస్యత చాలా అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో, రామచంద్రపేట సచివాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించి, గ్రామంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం త్వరలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇలా శిక్షణ పొందినవారికి పరీక్ష నిర్వహించి, దానిలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్తోపాటు, రూ.300 పారితోషకాన్ని కూడా అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇదొక గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. గ్రామంలో అవసరమైన చోట సామూహిక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, దానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఓటిఎస్ పథకంపై సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. పథకాన్ని వినియోగించుకున్నవారికి బ్యాంకులనుంచి రుణాలను ఇప్పించాలని సూచించారు. గ్రామంలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణానికి, కాంపౌండ్ వాల్కు, చెరువు అభివృద్దికి, దానిపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవడానికి, సోలార్ లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో మండల ప్రత్యేకాధికారి బి.పద్మావతి, హౌసింగ్ పిడి ఎస్వి రమణమూర్తి, డిపిఓ సుభాషిణి, సిడిపిఓ ఆరుద్ర, హౌసింగ్ డిఇ మురళీమోహన్, తాశీల్దార్ రమణమ్మ, ఇఓపిఆర్డి సురేష్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*సింగవరం సచివాలయం తనిఖీ*
*డెంకాడ* మండలం సింగవరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా హాజరు పట్టీని పరిశీలించారు. హాజరు తక్కువగా ఉన్న 13వ క్లష్టర్ వలంటీర్ పైడిరాజును విధులనుంచి తొలగించాలని ఆదేశించారు. మహిళలకు, పిల్లలకు నిర్వహిస్తున్న పరీక్షలపై ప్రశ్నించారు. వారి హీమోగ్లోబిన్ శాతాన్ని తెలుసుకున్నారు. రక్తం పెరగడానికి అవసరమైన పోషక పదార్ధాలను అందజేయాలని, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ఆరా తీశారు. ఉపాధిహామీ పనులపై ప్రశ్నించారు. సిమ్మెంటు త్వరలో రానుందని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. బిల్లులకు ఇబ్బంది లేదని, పాత బిల్లులు సైతం జూన్ మొదటివారంలో విడుదల కానున్నాయని చెప్పారు. ఓటిఎస్, ఈ క్రాప్ నమోదు, ఈ శ్రమ్ తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. జగనన్న గృహనిర్మాణంపై ప్రశ్నించి, శతశాతం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎస్డబ్ల్యూపిసి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. స్మశానవాటిక నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో గ్రామ సర్పంచ్ అప్పారావు, తాశీల్దార్ ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
