Kisan Credit Cards for Fisheries and Dairy Farmers, Eligibility Recognition through Special Campaign, Aim to lend to about 17,000 people, Priority to Women Farmers, District Collector A. Suryakumari
Publish Date : 17/11/2021
మత్స్య, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా అర్హుల గుర్తింపు
సుమారు 17వేల మందికి రుణాలివ్వాలని లక్ష్యం
మహిళా రైతులకు ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 16 ః అర్హులైన మత్స్యకారులు, పాడిరైతులు, పశు పెంపకం దారులను గుర్తించి, వారికి కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఇప్పటివరకు రుణం తీసుకోనివారికి, మహిళా రైతులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరుకు విధివిధానాలను ఖరారు చేసేందుకు, కలెక్టర్ తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, ఇప్పటికే క్రెడిట్ కార్డుల మంజూరుకు రైతులనుంచి దరఖాస్తులను సేకరించడం జరిగిందని చెప్పారు. వీటిని ఆయా బ్యాంకులకు పంపించామని తెలిపారు. ఈ రుణాలకు ఎటువంటి సబ్సిడీ ఉండదని, సకాలంలో చెల్లించినవారికి పావలా వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. కొత్తగా పశువులు కొనేందుకు కాకుండా, ఇప్పటికే ఉన్న పశువులకు సంరక్షణ, దాణా సదుపాయాల కల్పనకు ఈ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
లీడ్బ్యాంకు మేనేజర్ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కెసిసి మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను వివరించారు. సుమారు 16000 మంది పాడి, పౌల్ట్రీ రైతులు, పశు పెంపకం దారులకు, వెయ్యి మంది మత్స్యకారులకు, ఈ స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా క్రెడిట్ కార్డులను మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. మూడు నెలలు గడువుందని, ఆలోగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఆయా రైతుల వ్యక్తిగత రుణపరిమితిని బట్టి, రూ.లక్షా,60వేలు వరకు, మత్స్యకారులకు రూ.3లక్షలు వరకు రుణం లభిస్తుందన్నారు.
కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కొత్త యూనిట్లు స్థాపించేందుకు కాకుండా, ఉన్నవాటిని సక్రమంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించుకొనేందుకు ఈ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటివరకు రుణం తీసుకోనివారికి, మహిళా రైతులకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే విధానాన్ని రైతులకు అలవాటు చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరుపై రైతుల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని ఆదేశించారు. దీనికోసం పోస్టర్లను ముద్రించి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని, అలాగే ఆడియో మెసేజ్ను రూపొందించాలని సూచించారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారాన్ని తీసుకొని, అర్హులందరికీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఆసక్తి గలవారికి చాప్ కట్టర్స్ లాంటి యంత్ర పరికరాలను సరఫరా చేయాలని చెప్పారు. బ్యాంకులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ డిడి ఎన్.నిర్మలాకుమారి, డిసిసిబి సిఇఓ జనార్ధన్, పశుసంవర్థకశాఖ డిడి, ఏఎల్డిఎం, ఎస్బిఐ, ఎపిజివిబి, యూనియన్ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు.