Must work with commitment and dedication to achieve the goals, says Union Minister Manshuk Mandavi in Nithi Ayog review
Publish Date : 27/04/2022
*లక్ష్యాలను చేరుకోడానికి నిబద్ధత, అంకిత భావంతో పని చేయాలి
*ఆకాంక్షల జిల్లాలకు మరింత సహకారం
* ఏడాది లో అభివృద్ధి చెందిన జిల్లాగా విజయనగరం
* నీతీ అయోగ్ సమీక్షలో కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ
విజయనగరం, ఏప్రిల్ 26 : అనుకున్న లక్ష్యాలను సాధించడానికి నిబద్ధత, అంకిత భావం తో పని చేయవలసి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంభ సంక్షేమ మరియు రసాయన ఎరువుల శాఖా మంత్రి మన్షుక్ మాండవీయ తెలిపారు. అందుకోసం మనం ఎందులో బలంగా ఉన్నాం, ఎందులో బలహీనంగా ఉన్నాం అనేవాటిని గుర్తించి అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాలను నిర్దేశించుకోవాలని అన్నారు. గురువారం జిల్లా పర్యటన అనంతరం నీతీ అయోగ్, యాస్పిరేషనల్ జిల్లా సూచీ ల పై మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియం లో సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలాంటీ అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ భావించారని తెలిపారు. ఆ ఉద్దేశ్యం తోనే వెనుకబడిన జిల్లాలను యాస్పిరేషనల్ జిల్లాలుగా గుర్తింఛి సమాన అవకాశాలు, సమాన అభివృద్ధి అనే నినాదం తో పని చేస్తున్నామన్నారు. రాష్ట్రాల అభివృధికి కేంద్రం ఎల్లపుడూ సహకరిస్తుందని, యాస్పిరేషనల్ జిల్లాలకు మరింత తోడ్పాటునందించడం జరుగుతోందని తెలిపారు. కేంద్రం అయినా, రాష్ట్ర ప్రభుత్వమైనా అభివృద్దే ధ్యేయంగా పని చేస్తుందని, కేంద్రం కొన్ని పధకాలను స్వయంగాను, మరి కొన్ని పథకాలను రాష్ట్రాలతో జతపడి సంయుక్తంగానూ అమలు చేయడం జరుగుతోందని, కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా అమలు జరిపినవి కూడా విజయవంతం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఏడాది లో అభివృద్ధి చెందిన జిల్లాగా విజయనగరం:::
జిల్లాలో నీతీ అయోగ్ యాస్పిరేషనల్ సుచీలలో కొన్ని సూచీలు చాలా మెరుగ్గా ఉన్నాయని, మరి కొన్నిసూచీ లు కొంచం వెనుకబడి ఉన్నాయని , అయితే వచ్చే ఏడాది లోగా జిల్లా అన్నింటా మెరుగు పడి అభివృద్ధి చెందిన జిల్లా గా నిలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు. అందుకోసం శాఖల వారీగా ప్రణాళికలు వేసుకొని అంకిత భావం తో పని చేయాలనీ , అధికారులంతా దీనికి మద్దతు తెలపాలని కోరగా అధికారులంతా ఎస్ సర్ అని ముక్త కంఠం తో తెలిపారు. మళ్ళీ జిల్లాకు వస్తానని, అప్పటికీ అభివృద్ధి చెందిన జిల్లాల సరసన విజయనగరం ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు.
2025 నాటికి క్షయ, లెప్రసీ రహిత సమాజాన్ని చూడాలని అందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తున్నామని, ఒక సాఫ్ట్ వేర్ ను గుర్తించడం జరగుతుందని అన్నారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు సంస్థలు వారి ప్రాంతాల్లో నియోజకవర్గాలను దత్తత తీసుకొని ఆరోగ్యం, విద్య, తదితర అంశాల పై ప్రత్యెక డ్రైవ్ తో పని చేయవలసి ఉంటుందని తెలిపారు. పని చేసే వారి వివరాలు, ప్రాంతాలు ఆ సాఫ్ట్ వేర్ నందు నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు.
ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ పార్వతీపురం మన్యం కొత్త గా ఏర్పడిన జిల్లా కావడం తో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల పై కేంద్రం ప్రత్యెక దృష్టి పెట్టాలని కోరారు. ఆరోగ్యం, విద్య, గిరిజనుల జీవనో పాదులు అభివృద్ధి చెందాలని, గిరి పుత్రులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్, ఆర్ధిక సహాయం తదితర అంశాలలో సహకరించాలని కోరారు. గిరి ప్రాంతాల్లో 11 రహదారులకు అటవీ క్లియరెన్స్ రావలసి ఉందని, త్వరగా పరిష్కరించి రహదారులను అభివృద్ధి చేయాలనీ కోరారు.
తొలుత జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి నీతీ అయోగ్ సూచీల పురోగతి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి గారి సూచనల మేరకు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల సహకారం తో వచ్చే ఏడాది లోగా అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుతామని హామీ ఇచ్చారు.
పార్వతీపురం మన్యం కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా సూచీలను వివరించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్శియల్ స్కూల్స్ పై పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
సమావేశం లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎం.ఎల్.సి పి.వి.ఎన్.మాధవ్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, శంబంగి చిన్న అప్పల నాయుడు, కంబాల జోగులు బి.జే.పి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, వియజనగరం , పార్వతీపురం జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, ద్వారపూడి శ్రీనివాస్ , రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.
