Skill Development Training aimed at creating employment opportunities, District Collector Mrs. A. Suryakumari revealed
Publish Date : 30/10/2021
ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సెంచురియన్ వర్శిటీ సౌజన్యంతో శిక్షణకు ఏర్పాట్లు
యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పదకొండు వృత్తుల్లో శిక్షణకు ప్రతిపాదనలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి వెల్లడి
విజయనగరం, అక్టోబరు 29; జిల్లాలో యువత, నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కల్పించడం ద్వారా వారు స్వయంఉపాధి పొందే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని సెంచురియన్ యూనివర్శిటీ సౌజన్యంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉపాధి అవకాశాలు అధికంగా వున్న వృత్తుల్లోనే శిక్షణ కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ శిక్షణలో పాల్గొనే జిల్లాకు చెందిన యువతకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. వారం రోజుల్లోగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం తన ఛాంబరులో నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలపై సమీక్షించారు. సెంచురియన్ విశ్వవిద్యాలయం జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడంతో దీనిని జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూల బొకేల తయారీ, సోలార్ ప్యానళ్ల మరమ్మత్తులు నిర్వహణ, ఆటోమొబైల్ రిపేర్స్, ప్లంబింగ్, సెరమిక్ ఉత్పత్తుల తయారీ, ఏ.సి.లు, రిఫ్రిజిరేటర్ల మరమ్మతులు, హోటళ్ల రంగంలో రిసెప్షన్ శిక్షణ, పుట్టగొడుగుల తయారీ, చింతపండు శుద్ధి చేసి కేక్ రూపంలో ఉత్పత్తులుగా తయారీ, తేనెటీగల పెంపకం, అగరబత్తీల తయారీ, హోమ్ అప్లయోన్స్ల మరమ్మత్తులు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారని చెప్పారు. కనిష్టంగా వారం రోజుల నుంచి రెండు నెలల కాలం పాటు శిక్షణ వుంటుందన్నారు. జిల్లాలోని యువత ఈ ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నించాలని కోరారు. యువత తమకు ఆసక్తి వున్న రంగంలో శిక్షణ పొందవచ్చని చెప్పారు.
సెంచురియన్ యూనివర్శిటీ, నైపుణ్యాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాల షెడ్యూలు రూపొందిస్తాయని వెల్లడించారు. జిల్లాలో శిక్షణ పొందదలచిన యువతీ యువకులంతా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను సంప్రదించాలన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, సెంచురియన్ యూనివర్శిటీ గ్రామతరంగ్ సంస్థ ఎం.డి. బాబూ శంకర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సత్య శ్రీనివాస్, దివ్యాంగుల శాఖ ఏ.డి. నీలకంఠ ప్రదానో, నెహ్రూ యువకేంద్రం యువజన అధికారి విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.