Sri Mannaru Rajagopala Swamy Temple to be inaugurated for Ugadi celebrations, traditional Baddanga celebrations, District Collector A. Surya Kumari
Publish Date : 25/03/2022
ఉగాది వేడుకలకు ముస్తాబు కానున్న శ్రీ మన్నారు రాజగోపాల స్వామి ఆలయం
సంప్రదాయ బద్దంగా వేడుకలు
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
విజయనగరం, మార్చి 24::: శ్రీ శుభక్రుత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించే నిమిత్తం నగరంలోని శ్రీ మన్నార్ రాజగోపాల్ స్వామి వారి ఆలయ ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఆలయాన్ని సందర్శించి ఉగాది ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేద మంత్రోచ్చరణల మధ్య వేడుకలు సంప్రదాయ బద్దంగా నిర్వహించాలని సూచించారు. స్థానిక దేవాలయాల తో పాటు సింహాచలం దేవస్థానం కు చెందిన వేద పండితులను ఆహ్వానించి వేద పారాయణం జరిపించాలన్నారు. అన్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం , వేద మంత్రాలు , ఉగాది పచ్చడి , ప్రసాదాలతో ఘనంగా జరపాలన్నారు. దేవాలయాన్ని, పరిసరాలను సుందరంగా అలంకరించాలన్నారు.
ఆలయ విశిష్టతను తెలియజేసేందుకే ఈ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని సంతరించుకోవడం తో పర్యాటకులను విశిష్ట0గా ఆకర్షిస్తుందన్నారు. కొత్త కోవెళగా భక్తులు పిలుచుకునే ఈ ఆలయం లో పాంచరాత్ర విధానం లో పూజలు నిర్వహిస్తారని శ్రీ మహాలక్ష్మీ, జగన్నాధ స్వామి, నమ్మాళ్వారు విగ్రహాలకు పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంతటి విశిష్టత ఉన్న దేవాలయం కనుకనే పర్యాటక ప్యాకేజి అయిన విజయదర్శని ద్వారా దేవాలయ దర్శనానికి అవకాశం కల్పించడం జరిగిందన్నారు. పర్యాటక పరంగా కూడా దేవాలయానికి ప్రాచుర్యం లభించాలనే ఉగాది వేడుకలకు వేదికగా చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకట రావు, జిల్లా పర్యాటక అధికారి లక్ష్మీ నారాయణ , ఈ.ఓ బి.లక్ష్మీ నగేష్ , ఆలయ కమిటీ చైర్మన్ మాటూరి సతీష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
