*Take care of students like your own children * – Collector in the inspection of high schools in V.T.Agraharam
Publish Date : 25/11/2021
*విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి*
* విద్యతో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందించండి
* వి.టి. అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీలో కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, నవంబర్ 25 ః విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని, వారికి మంచి విద్యతో పాటు చక్కని పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ఆమె వి.టి. అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, విద్యా బోధన గురించి ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా పాఠశాలలోని వాటర్ ప్లాంట్ను, స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. అనంతరం వంటశాలను సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించారు. రోజు వారీ మెనూ అమలు గురించి తెలుసుకున్నారు. రైస్, కూరల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ అందుబాటులోకి తీసుకురాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. అలాగే పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పరిశీలించారు. దాన్ని వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, పనులు పూర్తి చేసేందుకు నివేదిక సమర్పించాలని సూచించారు.
*విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి*
తనిఖీలో భాగంగా కలెక్టర్ సూర్యకుమారి జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. వివిధ పరీక్షల్లో విద్యార్థుల సాధించిన మార్కుల జాబితాలను చూస్తూ ఒక్కో విద్యార్థితో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు తక్కువ రాగా.. దానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సరిగా బోధిస్తున్నారా… మీతో సరిగా ఉంటున్నారా.. తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకం అమలు, ఇతర అంశాలపై పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులను పక్కకు తీసుకెళ్లి కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. నాడు – నేడుతో అందుబాటులోకి వచ్చిన వసతులను, వనరులను వినియోగించుకొని అందరూ బాగా చదువుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.
