Close

The farmer should see a smile on his face, the farmer should have an RBK lay address, should focus on nature farming, V.A.A. S should act responsibly, said District Collector A. Surya Kumari in a training program on Kharif readiness

Publish Date : 06/06/2022

రైతు ముఖం లో చిరునవ్వు చూడాలి

రైతుకు ఆర్.బి.కే లే  అడ్రస్ కావాలి

ప్రకృతి వ్యవసాయం వైపు  దృష్టి మరల్చాలి

వి.ఏ.ఏ. లు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ఖరీఫ్ సన్నద్దత పై శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి

 విజయనగరం, జూన్ 04 :    దేశానికి వెన్నెముకైన  రైతు కోసం పని చేస్తున్నందుకు  వ్యవసాయ సహాయకులు  గర్వపడాలని, రైతుకు నిత్యం వెన్నంటి ఉండేలా పని చేస్తూ రైతు ముఖం లో చిరునవ్వును చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి  తెలిపారు.  గ్రామాల్లో బాధ్యతగా పని చేస్తే  ఎప్పటికీ  రైతు గుండెల్లో నిలిచి పోతారని, రైతులు వి.ఏ.ఏ. లను  స్వంత బిడ్డల్లా చూసుకుంటారని అన్నారు.   శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం  లో గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన  శాఖ సహాయకులకు  ఖరీఫ్ సన్నద్దత  పై ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో వి.ఏ.ఏ. లు మిషన్ మోడ్ లో పని చేయాలనీ, కేంద్ర  ప్రభుత్వం నుండి ఆర్.బి.కే స్థాయి వరకు ఒకే రకమైన సమాచారం ఉండాలని  తెలిపారు.   సన్నకారు , చిన్న కారు రైతులకు   చేయూత నివ్వాలని, వారికీ అందవలసిన  సహాయాన్ని వారు అడగక ముందే అందించాలని అన్నారు.  సాగు చేస్తున్న వారందరికి  ఈ క్రాప్ నమోదు జరగాలని, పంట రుణాలు అందాలని సూచించారు. రైతు మిల్లర్ దగ్గరకు వెళ్ళకుండా రైతు భరోసా కేంద్రం పై నమ్మకం తో రావాలని అన్నారు.  జిల్లాలో సరిపడా మిల్లులు లేనందున  చిరు ధాన్యాల వైపు దృష్టి మరల్చాలని, అంతర్ పంటలు వేసేలా అవగాహన కలిగించాలని అన్నారు.  ఈ జిల్లాలో మూడు పంటలకు అవకాశం ఉందని,  శాస్త్రవేత్తల సలహాలను వారికి  పూర్తిగా  అర్ధం అయ్యేలా అవగాహన కలిగించాలని అన్నారు.  పంటల మార్పిడి వలన భూ సారం దెబ్బతినకుండా ఉంటుందని, రైతుకు ఖర్చు కూడా తగ్గుతుందని, ఈ విషయాలను రైతులతో మమేకం అయి చెప్పాలని అన్నారు. ఏ రైతు ఏ పంట ఎంత విస్తీర్ణం లో వేస్తున్నారో ప్రతి వి.ఏ.ఏ. దగ్గర డాటా ఉండాలన్నారు.   కూరగాయలు, పండ్లను పండించే రైతుల కోసం  బొబ్బిలి , మోదవలస, కొత్తవలస లలో  మార్కెటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  కనీస మద్దతు ధర కంటే ఎక్కువ గిట్టుబాటు అయ్యేలా చూడాలన్నారు.

ప్రకృతి సేద్యమే ధ్యేయం కావాలి:

        సాగు భూమి 2045  నాటికి  40 శాతం వరకు క్షీణించ నున్నట్లు  పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయని,  అందువలన దేశం కరువు బారిన పడే అవకాశం ఉందని గుర్తించాలన్నారు.  రసాయనిక ఎరువుల వినియోగం  తగ్గితే గానీ  భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోలేమని, దీనికి సేంద్రియ వ్యవసాయం  ఒక్కటే మార్గమని అన్నారు.  పార్వతీపురం ప్రాంతం లో  ఊళ్లకు ఊళ్ళే సేంద్రియ వ్యవసాయం వైపు మారుతున్నాయని తెలిపారు.  రైతులతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి మరల్చాలని అన్నారు. ఆరోగ్యకరమైన  భూమి, పంటలు, ఆహారం,  తక్కువ పెట్టుబడి తో పొందవచ్చని తెలిపారు.

       వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు తొలుత జిల్లా ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళికను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణ వేత్త  జగ్గీ వాసుదేవ్  భూ తాపం, పర్యావరణం తదితర అంశాల పై వివరించిన వీడియో ను ప్రదర్శించారు. ఈ సమావేశం లో ఉద్యాన శాఖ దిది శ్రీనివాస రావు, ఎపి ఎం.ఐ.పి పి.డి లక్ష్మి నారాయణ,  డి డి ఏ, ఏడీఏ లు పాల్గొన్నారు.

పోస్టర్ విడుదల :

         ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని  నేచర్ స్వచంద సంస్థ  ముద్రించిన పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.  ప్రకృతి మనకు చాల ఇస్తుంది. మనం ఒక్క మొక్క నాటి  ప్రకృతికి ఇద్దాం..సురక్షితమైన వాతావరణం లో జీవిద్దాం అని పిలుపునిచ్చారు.  ప్రతి ఒక్కరు మొక్క నాటి భూగోళాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యాన్ని సంరక్షిద్దాం ఆరోగ్యవంతమైన జీవితాన్ని భవిష్యత్ తరాలకు అందిద్దాం..అని కలెక్టర్ తెలిపారు.

The farmer should see a smile on his face, the farmer should have an RBK lay address, should focus on nature farming, V.A.A. S should act responsibly, said District Collector A. Surya Kumari in a training program on Kharif readiness