Vaccination process needs speed up District Collector A. Surya Kumari
Publish Date : 01/12/2021
వాక్సినేషన్ ప్రక్రియ వేగం కావాలి
జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి
కోవిడ్ తో పాటు రక రకాల వేరియంట్ల భయాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి వాక్సిన్ వేసి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టరు ఏ.సూర్య కుమారి వైద్యాధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో కోవిడ్ వాక్సినేషన్ పై పి.హెచ్.సి వారీగా సమీక్షించారు. వాలంటీర్ల సహకారం తో వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డైలీ ప్రోగ్రెస్ చూస్తానని, మీరు చెప్పే కారణాలు ఇక పై వినడం జరగదని, పురోగతి కనపడక పోతే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని అన్నారు. తన సచివాలయ తనిఖీల్లో అనేక మంది ఇప్పటికి వాక్సిన్ వేసుకోలేదని తెలుస్తోందని, శత శాతం వాక్సినేషన్ జరగాలని అన్నారు. ఇంటింటికీ వైద్యులు వెళ్లి అవగాహన కలిగించి వాక్సిన్ వేయాలన్నారు. ఇందుకోసం ప్రతి వైద్యాధి కారి వద్ద ఒక కార్యాచరణ ప్రణాళిక ఉండాలన్నారు. ఎవ్వరూ రిలాక్స్ కాకూడదని, కోవిడ్ ముప్పు ఉందనే భావించాలని, మాస్క్ తప్పనిసరిగా వినియోగించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకొని వాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశం లో డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి, డిప్యూటీ డి.ఎం.హెచ్ ఓ లు పాల్గొన్నారు.