Villages should be made clean with a clean conscience. This program should be overseen by special officers. Focus on literacy in the district. Come to the meeting with full information with Special Officers District Collector Smt. Suryakumari
Publish Date : 06/06/2022
స్వచ్ఛసంకల్పంతో గ్రామాలు పరిశుభ్రంగా రూపొందాలి
ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలి
జిల్లాలో అక్షరాస్యత పెంపుపై దృష్టి సారించాలి
21 ఏళ్ల లోపు ఏ బాలికకూ వివాహం జరిగేందుకు వీల్లేదు
డి.ఆర్.సి. సమావేశానికి పూర్తి సమాచారంతో రండి
ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, జూన్ 3 :
మన జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి వుందని, జిల్లాలో అక్షరాస్యత పెంపొందించే దిశగా జిల్లా అధికారులు, యంత్రాంగం సమిష్టి కృషిచేయాల్సి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. ముఖ్యంగా వయోజన నిరక్షరాస్యత అధికంగా ఉన్నందున ఆయా వర్గాల వారిలో కనీస స్థాయిలో ఆర్ధిక, డిజిటల్ అక్షరాస్యత పెంపొందించే దిశగా ప్రయత్నాలు చేయాల్సి వుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆన్లైన్ సమావేశంలో మాట్లాడారు. స్కూలుకి వెళ్తూ మధ్యలోనే చదువుకు స్వస్తిపలికిన 18 ఏళ్ల లోపు బాలబాలికలను గుర్తించి వారిని బ్రిడ్జి కోర్సుల ద్వారా మళ్లీ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించే ప్రయత్నం చేయాలన్నారు. ఆయా మండలాల్లో బడి మానివేసిన పిల్లలను వెంటనే గుర్తించి తనకు నివేదిక అందజేయాలని కోరారు.
సఖి గ్రూపులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారని, ఆయా గ్రూపులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టేలా, సమావేశాలు క్రమంతప్పకుండా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. బాలికల్లో విద్య, ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించి వారికి 21 ఏళ్ల వయస్సులోపల వివాహం జరగకుండా నిరోధించడమే ఈ గ్రూపుల ఏర్పాటు ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ గ్రూపుల ఏర్పాటు ఉద్దేశ్యాలు నెరవేర్చేలా మండల స్థాయి అధికారుల్లో అవగాహన కలిగించాలన్నారు.
గ్రామాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్త వేర్వేరుగా వేస్తూ చెత్త సేకరణలో సహకరించినపుడే ఇది సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో ఈ విధానంలో చెత్త సేకరణ జరుగుతున్నదీ లేనిదీ పర్యవేక్షణ చేయాలని కోరారు. ప్రతిరోజూ గ్రామంలో ఉదయాన్నే చెత్త సేకరణ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో నిర్మించిన ఘన వ్యర్ధాల శుద్ధీకరణ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసిన వర్మీకంపోస్టును రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల ప్రక్కనే చెత్తకుప్పలు వేస్తున్నారని, దీనివల్ల జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని, అందువల్ల ఆయా గ్రామాల్లో రహదారుల పక్క చెత్తవేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారుల కృషివల్ల గత నెలలోనే ఏడు వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో వివిధ దశల్లో వున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆ తదుపరి దశలకు తీసుకువెళ్లేలా చొరవ చూపాలన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్లో 12 ఏళ్లు పైబడిన వారికి రెండు విడతల్లో, 50 ఏళ్లు పైబడిన వారికి మూడో విడత వ్యాక్సిన్ వేయడంపై దృష్టి సారించాలన్నారు.
జిల్లా సమీక్ష సమావేశానికి జిల్లా స్థాయి విభాగాధిపతులే రావాలని, తమ సహాయక అధికారులను పంపించవద్దని కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ సమావేశానికి పూర్తి సమాచారంతో అధికారులు హాజరు కావాలన్నారు.
