At the end of the month, the landscaping of the Tirthasagaram landsman should be completed by the Sujala Savanti landscape, the residents of the residents should be uploaded, and the Rebirth Commissioner, Dr. CH Sridhara Project
Publish Date : 06/06/2022
నెలాఖరుకు తోటపల్లి, తీర్ధసాగరం భూసేకరణ పూర్తికావాలి
సుజల స్రవంతి భూసేకరణ వేగవంతం కావాలి
నిర్వాసితుల పరిహారం బిల్లులు అప్ లోడ్ చెయ్యాలి
పునరావాస కమిషనర్ డా.సిహెచ్.శ్రీధర్
ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసంపై అధికారులతో సమీక్ష
సమస్యల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా ప్రయత్నించాలి : జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూన్ 03 :
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పునరావాస కమిషనర్ డా.సిహెచ్.శ్రీధర్ జిల్లా అధికారులకు సూచించారు. తోటపల్లి, తారకరామతీర్థ సాగరం, బాబూ జగజ్జీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై ఆయన శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జె.సి. ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లి కాల్వల కోసం భూసేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందని, 5,290 ఎకరాలకు గాను 5,039 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయ్యిందని మిగిలిన 250 ఎకరాల భూసేకరణను నెలాఖరు కల్లా పూర్తిచేయాలన్నారు. వారం రోజుల్లోగా భూములకు పరిహారం చెల్లించాల్సిన బిల్లులు అప్ లోడ్ చేయాలని జె.సి. మయూర్ అశోక్ కు సూచించారు.
తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టుకోసం 3447 ఎకరాలు సేకరించాల్సి వుండగా ఇప్పటికే 3235 ఎకరాలు సేకరించారని మిగిలిన భూమి 212 ఎకరాలు ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కోరారు. ఇప్పటికే 33 ఎకరాలకు బిల్లులు సిద్ధంగా వున్నందున వాటిని అప్ లోడ్ చేసి ఉత్తరాంద్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్కు సమాచారం అందజేస్తే ఆయన బిల్లుల చెల్లింపుకోసం అవసరమైన బడ్జెట్ మంజూరు చేసేందుకు చర్యలు చేపడతారని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియలో వివిధ దశల్లో వున్న 212 ఎకరాలను త్వరితంగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
తారకరామ ప్రాజెక్టు పునరావాసం క్రింద కోరాడపేట గ్రామస్థులకు పరిహారం చెల్లింపు పూర్తయ్యిందని నెల్లిమర్లలో పునరావాస కాలనీ నిర్మాణానికి స్థలం కూడా గుర్తించామని ఆర్.డి.ఓ. భవానీ శంకర్ వివరించారు. ఏ.టి.అగ్రహారం, పడాలపేట గ్రామాల నిర్వాసితులు ఏకమొత్తం చెల్లింపు(ఒన్టైం సెటిల్మెంట్) కోరుకుంటున్నందున ఆ మేరకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. పి.డి.ఎఫ్.గ్రామంగా గుర్తించిన సారిపల్లి వాసులకు పరిహారం చెల్లింపు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కింద జిల్లాలో 4,500 ఎకరాల భూమిని రెండు ప్యాకేజీల్లో సేకరించాల్సి వుందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నించాలని కమిషనర్ సూచించారు.
భూసేకరణ సమస్యలు, పునరావాస సమస్యలు వచ్చినపుడు వాటిని సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వరకు వేచిచూడకుండా వెనువెంటనే తమ తోటి అధికారులతో మాట్లాడి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తే ఎంతో సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి చెప్పారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ. గణపతిరావు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎస్.సుగుణాకరరావు, జలవనరుల శాఖ ఇ.ఇ. రామచంద్రరావు, చీపురుపల్లి ఆర్.డి.ఓ. ఎం.అప్పారావు, సర్వే విభాగం ఏ.డి. టి.త్రివిక్రమరావు, కె.ఆర్.ఆర్.సి. డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
