* Better results should be obtained in OTS * * Collector Suryakumari in Boppadam Secretariat Inspection * Collector dissatisfied with the management of dumping yards
Publish Date : 07/12/2021
*ఓటీఎస్లో మెరుగైన ఫలితాలు రాబట్టాలి*
*బొప్పడాం సచివాలయ తనిఖీలో కలెక్టర్ సూర్యకుమారి
*డంపింగ్ యార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
విజయనగరం, డిసెంబర్ 07 ః రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత గృహ హక్కు (ఓటీఎస్- ఒన్ టైం సెటిల్మెంట్) పథకంలో మెరుగైన ఫలితాలు సాధించాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూర్యకుమారి సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. మంగళవారం ఆమె నెల్లిమర్ల మండలం బొప్పడాం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఉత్తమ సేవలందించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని లబ్దిదారులు ఉపయోగించుకొనేలా కింది స్థాయి సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఒప్పించాలని సూచించారు. గ్రామ పరిసరాల్లో ఎక్కడబడితే అక్కడే చెత్త వేస్తున్నారని, డంపింగ్ యార్డులను ఎందుకు వినియోగించటం లేదని స్థానిక అధికారులను కలెక్టర్ ఈ సందర్బంగా ప్రశ్నించారు. తక్షణమే డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకొచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఓటీఎస్, వ్యాక్సినేషన్, ఈ-కేవైసీ ప్రక్రియపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను పరిశీలించారు. రైస్ కార్డుల జారీలో, ఎఫ్ లైన్ పిటిషన్ల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా అందే సేవలను విస్తృతం చేయాలని చెప్పారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.
ఎంపీడీవో రాజ్ కుమార్, తహశీల్దార్ రమణ రాజులు, మెడికల్ ఆఫీసర్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.