Cement companies should be given dry rubbish, Panchayati Raj Chief Secretary Gopalakrishna Dwivedi, Job Cards for all eligible: District Collector Smt. Suryakumari
Publish Date : 30/05/2022
సిమెంటు కంపెనీలకు పొడి చెత్త తరలించాలి
పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
అర్హులందరికీ జాబ్ కార్డులు : జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం, మే 26 : గ్రామాల్లో ఇళ్ల నుంచి సేకరించిన పొడి చెత్తను వారం రోజులకోసారి సమీపంలోని సిమెంటు కంపెనీలకు తరలించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆయా సిమెంటు కంపెనీలు చెత్తను తీసుకునేందుకు సిద్ధంగా వున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్య కార్యదర్శి ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్లు గురువారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. జగనన్న స్వచ్ఛసంకల్పంలో భాగంగా గ్రామాల్లో ఇళ్ల మధ్య చెత్తకుప్పలు లేకుండా వాటిని గ్రామానికి దూరంగా తరలించే కార్యక్రమాన్ని శతశాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామాలన్నీ పరిశుభ్రంగా రూపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోడి మే 31న రాష్ట్రంలోని విజయనగరంతోపాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన కేంద్ర పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖిలో పాల్గొంటారని, ఈ కార్యక్రమం కోసం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్ర పథకాల లబ్దిదారులను గుర్తించి ఆ పథకాల ద్వారా వారు పొందిన ప్రయోజనాలను ప్రధానికి వివరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సగటు వేతనం పెరిగేలా ఆయా జిల్లా కలెక్టర్లు కృషిచేయాలని ఆదేశించారు. సగటు వేతనం అధికంగా వుంటేనే ఈ కార్యక్రమంలో పనిచేస్తేనే మెటీరియల్ కాంపొనెంట్ నిధులు అధికంగా వినియోగించుకోవచ్చన్నారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపొనెంట్ పనుల కోసం బిల్లులు ఆన్లైన్ లో అప్ లోడ్ చేసే విషయంలో శ్రద్ధ చూపాలని పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ చెప్పారు. ఈ నెల 13వ తేదీ నాటికి అప్ లోడ్ చేసిన బిల్లులకు చెల్లింపులు పూర్తిచేశామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్షకు తావులేకుండా జాబ్ కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. జాబ్ కార్డుల జారీలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు.
ఈ సమావేశంలో డిపిఓ సుభాషిణి, డ్వామా ఏపిడి లక్ష్మణరావు, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. అశోక్ కుమార్, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. కె.శివానందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
