Control rooms should be set up in the secretariats on Asani cyclone: District Collector
Publish Date : 11/05/2022
అసని తుఫాన్ పై సచివాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలి : జిల్లా కలెక్టర్
విజయనగరం, మే 10:
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను నేపథ్యంలో తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పెనుగాలులు వీచే అవకాశం ఉందని, మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తాము పనిచేసే కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని మండల కేంద్రాలు, గ్రామ సచివాలయం లలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి ఆ ఫోన్ నంబర్ లను ఆయా ప్రాంత ప్రజలకు తెలియజేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా సమాచారం ఇవ్వాలని తెలియజేయాలన్నారు. తహశీల్దార్, ఎం.పి.డి.ఓ., మునిసిపల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలన్నారు.
అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా గ్రామస్థాయిలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్ మరియు హోర్డింగ్ లు వంటి వాటిని తొలగించి అదేవిధంగా పూరి గుడిసె లు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నా కట్టడాల్లో ఉన్న ప్రజల్ని యుద్ధ ప్రాతిపదికన సురక్షితంగా ఉండే బిల్డింగ్స్ లోకి తరలించాల్సి ఉంది.
ప్రజలు ఎవరిని కూడా ఈ వర్షం సంభవించే సమయంలో బయటికి రాకుండా వాలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
