Distribution of TLM kits to children with special needs at the call of District Collector A. Suryakumari
Publish Date : 14/12/2021
దివ్యాంగులకు చక్కని భవిష్యత్తునిద్దాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పిలుపు
ప్రత్యేక అవసరాల పిల్లలకు టిఎల్ఎం కిట్లు పంపిణీ
విజయనగరం, డిసెంబరు 14 ః
పిల్లల్లో వికలాంగత్వం ఉందని బాధపడవద్దని, వారికి మంచి భవిష్యత్తునిచ్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి పిలుపునిచ్చారు. దివ్యాంగుల అభివృద్దికి ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ కిట్లను మంగళవారం కలెక్టర్ పంపిణీ చేశారు. ఒక్కొక్కటి సుమారు రూ.10వేలు విలువచేసే 162 కిట్లను ఎన్ఐఇపిఐడి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పెర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ) సమకూర్చింది. ఈ కిట్లను పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, దివ్యాంగుల్లో కూడా ఏదో ఒక ప్రతిభ దాగిఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారని అన్నారు. ఆ దిశగా వారి తల్లితండ్రులు కృషి చేయాలన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలగురించి దిగులు చెందవద్దని, ఏ కల్మషం అంటని వారి జన్మ, పూర్వజన్మ సుకృతంగా, అదొక అధృష్టంగా భావించాలని సూచించారు. ఇటువంటి పిల్లలను పెంచి పెద్దచేయడానికి తల్లితండ్రులకు ఎంతో ఓర్పు, సహనం అవసరమని అన్నారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులకు గతంతో పోలిస్తే, విద్య, ఉద్యోగావకాశాలు ఎంతో మెరుగుపడ్డాయని, ప్రభుత్వపరంగా తగిన సహకారం అందుతోందని చెప్పారు. ఈ అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా వారికి బంగారు భవిష్యత్తునివ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వామినాయుడు, ఎన్ఐఇపిఐడి ప్రతినిధులు ప్రవీణ్కుమార్, పాచిపన్, సహితవిద్య జిల్లా సమన్వయకర్త ఎం.శ్రీనివాసరావు, సహాయ సమన్వయకర్త ఎం.భారతి, సహిత విద్య ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.