District Collector A. Suryakumari ordered the officials to carry out 100% grounding of all Nadu-Nedu works in the district by the 10th of this month.
Publish Date : 10/08/2022
10వ తేదీ నాటికి నాడూ-నేడు పనులన్నీ గ్రౌండింగ్
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఆగస్టు 08 ః ఈ నెల 10 వ తేదీ నాటికి జిల్లాలో నాడూ-నేడు పనులన్నీ శతశాతం గ్రౌండింగ్ జరగాలని, అధికారులను జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. నాడూ-నేడు ఫేజ్ 2 పనులపై, తన ఛాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. సిమ్మెంట్, ఇసుక, ఐరన్ ఇతర నిర్మాణ సామగ్రి సరఫరాపై ఆరా తీశారు. పనులన్నిటినీ 10వ తేదీ నాటికి మొదలుపెట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాడూనేడు ఫేజ్-2 క్రింద, జిల్లాలో 747 పాఠశాలల్లో, రూ.244 కోట్ల అంచనా వ్యయంతో, 1070 అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. వీటిలో 160 వరకు అంగన్వాడీ భవనాలు కూడా ఉన్నాయని చెప్పారు. వీటిలో ఇప్పటివరకు సుమారు 500 భవనాల నిర్మాణం ప్రారంభమయ్యిందని, మిగిలిన చోట్ల కూడా వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం కోసం, ఐసిడిఎస్ సూపర్వైజర్లు చొరవ చూపాలని, వెంటనే జాయింట్ అకౌంట్లు తెరిపించాలని సూచించారు. జూనియర్ కళాశాలల భవనాల నిర్మాణం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పోషకాహార పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్ విఏ స్వామినాయుడు, ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, డివిఈఓ సురేష్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
