District Collector A. Suryakumari warned that action should be taken against officers and staff who show negligence in duty.
Publish Date : 10/05/2022
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు
*నీతి ఆయోగ్ నిర్దేశిత లక్ష్యాలను తప్పకుండా చేరుకోవాల్సిందే
*ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంపై వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్
విజయనగరం, మే 09 ః విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి హెచ్చరించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సేవలను విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె పేర్కొన్నారు. ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలకు నిర్దేశించిన సూచీల ప్రగతిపై ఆమె సోమవారం తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి, ఏప్రిల్ నెలలో ఆయా శాఖలు సాధించిన ప్రగతి, పని తీరుపై ఆరా తీశారు. లక్ష్యాలను ఉన్నతంగా నిర్దేశించుకోవాలని వాటిని చేరుకునేందుకు అహర్నిశలూ శ్రమించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పలు అంశాలపై మార్గనిర్దేశకాలు జారీ చేశారు. ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో జిల్లా ఇంకా మెరుగైన ఫలితాలను సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై సూచనలు చేశారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు సమన్వయంతో కూడిన కృషి చేయాలని పేర్కొన్నారు. పని విషయంలో అలసత్వం ప్రదర్శించే ఉద్యోగి లేదా సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారు అందించే సేవలపై పరిశీలన ఉండాలని, సరిగ్గా పని చేయని వారికి మెమోలు జారీ చేయాలని సూచించారు. గర్భిణుల వివరాలు నమోదు చేయటంలో, గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి సారించని మెడికల్ ఆఫీసర్లపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని డీఎం & హెచ్వోను ఆదేశించారు. కె. కొత్తవలస, ఆరికితోట, రామభద్రపురం, దత్తిరాజేరు పీహెచ్సీల పరిధిలో పుల్ ఇమ్యునైజేషన్ టీకాలు అందించటంలో అలసత్వం ప్రదర్శించిన మెడికల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించండి
గర్భిణులు, పిల్లల ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ విధంగా వారిని జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోషకాహారం అందజేయటంలో, వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాల నమోదులో కచ్చితత్వం పాటించాలని సూచించారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఆడపిల్ల పుడితే కొంతమంది వివక్షత చూపుతున్నారని, ఆ విధానం రూపుమాసిపోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులను గుర్తించి వారిని ప్రత్యేకంగా అభినందించాలని డీఎం & హెచ్వో, ఐసీడీఎస్ పీడీకి సూచించారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఇన్వెర్టర్లపై ఏర్పాటుపై ఆరా
గ్రామీణ, పట్టణ పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో ఇన్వెర్టర్ల ఏర్పాటుపై డీసీహెచ్ఎస్ను, ఇతర వైద్యాధికారులను కలెక్టర్ ఆరా తీశారు. ఏయే ఆసుపత్రుల్లో ఇన్వర్టెర్లు అవసరం, ఆర్థిక వనరలు ఏ మేరకు ఉన్నాయి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిధులు అందుబాటులో ఉన్న చోట త్వరితగతిన ఇన్వర్టెర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. పాడైన వాటికి మరమ్మతులు చేయించాలని సూచించారు.
సమావేశంలో సీపీవో బాలాజీ, డీసీహెచ్ఎస్ లక్ష్మణరావు, డీఎం & హెచ్వో రమణ కుమారి, డీఐవో నారాయణరావు, డా. సుగుణాకర్ రావు, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
