District Collector Mrs. A. Suryakumari inspected the District Parish High School in Gotlam, Bondapally Zone.
Publish Date : 20/11/2021
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
మధ్యాహ్న భోజన పథకంపై ఆరా
బొండపల్లి మండలంలో పర్యటన
సచివాలయం, ఓటర్ల నమోదు పరిశీలన
బొండపల్లి, (విజయనగరం), 20.11.21 ః బొండపల్లి మండలం గొట్లాంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం బొండపల్లి మండలంలో పర్యటించారు.
కలెక్టర్ సూర్యకుమారి ముందుగా జెడ్పి ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నూతన విద్యావిధానం అమలు పై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై, హెడ్మాష్టర్ బి.శ్రీనివాసాచారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెనూ అమలుపై ప్రశ్నించారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, తరగతి గదులు, బల్లల సంఖ్య, మరుగుదొడ్ల నిర్వహణ తదితర వివరాలను అడిగారు. పాఠశాలలో ఆర్ఎంఎస్ఇ నిధులతో నిర్మించి, నిధులు చాలక అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులపై ప్రశ్నించారు. అదనంగా నిధులు మంజూరు చేసి, దానిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, విద్యార్థులకు మెరుగైన బోధనా పద్దతులను అమలు చేయాలని ఆదేశించారు.
అనంతరం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తులపై ప్రశ్నించారు. గ్రామంలో కోవిడ్ వేక్సినేషన్, ఓటిఎస్ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రజలనుంచి వచ్చే వినతులపై ఎప్పటికప్పుడు స్పందించాలని సూచించారు. శతశాతం వేక్సినేషన్ పూర్తి చేయాలని, ఓటిఎస్పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.