Everyone should be vaccinated with Covid, District Collector Suryakumari
Publish Date : 06/01/2022
ప్రమాద ఘంటికలు….
థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
ప్రతీ ఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేసుకోవాలి
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జనవరి 05: కోవిడ్ థర్డ్ వేవ్ వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని, ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి హెచ్చరించారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వేక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కోరారు. జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 39 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయని, ఒకే పాఠశాలలో 19 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గించే విషయమని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ మొదటి డోసు పూర్తయినప్పటికీ, రెండో డోసు ఇంకా పెండింగ్ ఉందని అన్నారు. రెండోడోసు వేసుకోవాల్సిన వారిలో 35,596 మందికి ఇప్పటికే నిర్ణీత గడువు దాటిపోయిందని, మరో 26,863 మందికి గడువు సమీపించిందని, వీరంతా తక్షణమే రెండో డోసు తీసుకోవాలని కోరారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు, హెల్త్ కేర్ సిబ్బందికి, 60 ఏళ్ళు దాటిన వారికి త్వరలో మూడో డోసు వేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ ఆసుపత్రులను, హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజేర్ లేదా సబ్బుతో తరచు చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి సంక్రాంతి పండుగకు వచ్చేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ టెస్టులు చేయించు కోవాలని కలెక్టర్ కోరారు.