* Everyone should be vigilant about Covid Thirdwave * Collector Suryakumari who met exclusively with District Officers
Publish Date : 14/12/2021
*తస్మాత్ జాగ్రత్త*
* కోవిడ్ థర్డవేవ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ సూర్యకుమారి
* ఒమిక్రాన్ కేసులు లేవు… ఎవరూ ఆందోళన చెందవద్దని సూచన
* బయట ప్రాంతాల నుంచి వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు
విజయనగరం, డిసెంబర్ 13 ః కోవిడ్ థర్డ్వేవ్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను హెచ్చరించారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందన్న నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇతర అధికారులతో ఆమె సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని ప్రజలు భయాందోళనలు చెందవద్దని ధైర్యం చెప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో ముందుగా ఆమె జిల్లాలోని తాజా పరిస్థితిని వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నారు. తీసుకున్న చర్యల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంగా వ్యవహరించాలని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసుల నమోదు శాతం 2.12 ఉందని పేర్కొన్నారు. ఒకవేళ పరిస్థితి విషమించి కేసుల నమోదు శాతం మించితే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ మొదటి, రెండు దశలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ తప్పకుండా మాస్కు ధరించేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సమూహం లేకుండా చూసుకోవాలని, భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. చాలా చోట్ల ప్రజలు మాస్కులు ధరించటం లేదని దీనిపై పోలీసు శాఖ, ఇతర అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు మాస్కు ధరించటం లేదని గుర్తు చేశారు. ఈ రెండు మూడు రోజుల్లో జేసీ రెవెన్యూ, పోలీసు శాఖ సంయుక్తంగా సినిమా థియేటర్లు, ఆలయాలను పరిశీలించి అక్కడ పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై, కోవిడ్ నిబంధనల అమలుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కోవిడ్ పట్ల నిర్లిప్తత, నిర్లక్ష్యం కుదరదని కలెక్టర్ సూర్యకుమారి హెచ్చరించారు. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
*10 శాతానికి మించితే ప్రత్యేక చర్యలు*
అనంతరం జేసీ మహేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసుల నమోదు 10 శాతానికి చేరితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతానికి బయట ప్రాంతాల నుంచి జిల్లాకు 243 మంది వచ్చారని, వారిలో 191 మందిని గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని త్వరలోనే గుర్తిస్తామని పేర్కొన్నారు. బయట నుంచి వ్యక్తుల వివరాలు ఐ.డి.ఎస్.పి. (ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేయలెన్స్ ప్రోగ్రాం) సెక్షన్ లో లభిస్తాయని వారి నుంచి వివరాలు సేకరిస్తూ పోలీసు విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ పరీక్షల పర్యవేక్షణ బాధ్యతలు డీఐవో గోపాల కృష్ణ చూడాలని ఆదేశించారు. అలాగే మానవ వనరుల కేటాయింపును డీఆర్వో, డీఎం & హెచ్వో, డీసీహెచ్ ఎస్ ఆధ్వర్యంలోని కమిటీ చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కోవిడ్ హెల్ప్ లైన్ బాధ్యతలను డీడీ మెప్మాకు, విలేజ్ కోవిడ్ కేర్ సెంటర్లను జడ్పీ సీఈవోకు, మృతుల వివరాల సేకరణ తదితర చర్యల బాధ్యతలను విజయనగరం ఆర్డీవోకు, హాస్పిటల్ మేనేజ్మెంట్ బాధ్యతలను ఏపీఎంఐఎస్ఐడీసీ ఈఈ కు, డీఎం & హెచ్వో, డీపీవోకు, అంబులెన్స్, ఇతర ట్రాన్స్పోర్టు వ్యవహారాల బాధ్యతలను ఉప రవాణా శాఖ అధికారికి, మందులు, ఇతర డ్రగ్స్ బాధ్యతలను డ్రగ్ ఇనస్పెక్టర్కు, డేటా మేనేజ్మెంట్ బాధ్యతలను సీపీవోకు అప్పగిస్తూ జేసీ మహేశ్ కుమార్ ప్రకటన చేశారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో గణపతిరావు, అదనపు డీఎం & హెచ్వో రామ్మోహన్ రావు, డీసీహెచ్ఎస్ డా. నాగభూషణరావు, మెప్మా డైరెక్టర్ సుధాకర్, సీపీవో విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీఐవో గోపాల కృష్ణ, సీడీపీవో రాజేశ్వరి, ఎస్.ఎస్.ఏ. పీవో స్వామినాయుడు, డీఎస్వో పాపారావు, సహకార అధికారి అప్పలనాయుడు, మార్కెటింగ్ శాఖ ఏడీ శ్యామ్ కుమార్, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.