High position through education, need for communication skills for students, Collector Suryakumari who inspected the school, Kondavelangada Village Secretariat Visit
Publish Date : 01/12/2021
విద్యద్వారా ఉన్నత స్థానం
విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం
పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సూర్యకుమారి
కొండవెలగాడ గ్రామ సచివాలయం సందర్శన
విద్యద్వారా ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. శారీరక లోపాలను పట్టించుకోకుండా, ఆత్మస్థైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను, కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును, త్రాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. భోజన పథకం, మెనూ అమలుపై విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. వంటశాల వద్ద పలు మార్పులను సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల ఖాలీల వివరాలను ప్రధానోపాధ్యాయులు విక్టోరియా రాణిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి పదోతరగతి విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి వ్యక్తిగత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మ స్థైర్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బాగా చదువుకుంటే, ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని అన్నారు. వర్తమాన అంశాలపట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలని, దానికోసం ప్రతిరోజూ జరిగే స్కూల్ అసెంబ్లీలో వార్తా పత్రికలను చదివించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని, దానిని అలవాటు చేయాలని హెచ్ఎంకు కలెక్టర్ సూచించారు.
ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేయాలి
రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అలవాటు చేయాలని కలెక్టర్ సూర్యకుమారి, సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కొండవెలగాడ గ్రామ సచివాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించారు. సిటిజన్ అవుట్రీచ్పై ఆరా తీశారు. ఆదాయ, మరణ దృవీకరణ పత్రాలు, కుటుంబ సర్టిఫికేట్లు, రేషన్ కార్డుల్లో చేర్పులకు ఎక్కువ రోజులు గడువు తీసుకోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోవిడ్ వేక్సినేషన్పై ఆరా తీశారు. థర్డ్వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, గ్రామంలో శతశాతం వేక్సినేషన్ జరగాలని ఆదేశించారు. గ్రామంలో జరుగుతున్న వివిధ రకాల పూలసాగుపై ప్రశ్నించారు. పూలసాగును అభివృద్దికి తగిన చర్యలు తీసుకోవాలని, ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రామంలో భూసార పరీక్షలు నిర్వహించి, అందరికీ సాయిల్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగాన్ని పెంచాలని, దీనికోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో ఎంపిడిఓ రాజ్కుమార్ పాల్గొన్నారు.