* Immediate solution to response requests * * Collector Suryakumari directing officers * 253 Petitioners submitting requests
Publish Date : 21/12/2021
*స్పందన వినతులకు సత్వర పరిష్కారం*
* అధికారులను ఆదేశించిన కలెక్టర్ సూర్యకుమారి
* 253 వినతులు సమర్పించిన అర్జీదారులు
విజయనగరం, డిసెంబర్ 20 ః స్పందనలో వచ్చే వినతులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన స్పందనలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆమె ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 141 వినతులు రాగా వైద్యారోగ్య శాఖకు 52, డీఆర్డీఏకు 40, డీఎస్వోకు 20 మొత్తం 253 వినతులు ప్రజల నుంచి అందాయి. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. కలెక్టర్ తో పాటు జేసీలు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, డీపీఎం పద్మావతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
స్పందన చివరిలో కలెక్టర్ సూర్యకుమారి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. పలు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. సాలూరు మండలం బాగువలసలో ప్రైమరీ పాఠశాలను, ఉన్నత పాఠశాలలో విలీనం చేయటం వల్ల సమస్య ఉత్పన్నమవుతుందని గ్రామస్థులు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబంధిత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని వికలాంగులు వినతి సమర్పించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురంలో స్కిల్ డెవలెప్మెంట్ పథకంలో భాగంగా అందించిన శిక్షణలో అవకతవకలు జరిగినట్లు లబ్ధిదారులు కలెక్టర్ ను ఆశ్రయించగా సమస్యను పరిష్కరించాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యాక్సినేషన్ 100 శాతం దాటడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యమైన వైద్య సిబ్బందిని, అధికారులను, సచివాలయ ఉద్యోగులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.
*అసంపూర్తి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి*
మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వివిధ పథకాల్లో భాగంగా నిర్మాణ పనులు జరిగి అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఇలాంటి భవనాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. అలాగే ఓటీఎస్ పథకంలో భాగంగా సమ్మతి తెలిపిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ క్రమంలో నిబంధనలు పాటించాలని చెప్పారు. తక్కువ మంది ఉంటే గ్రామాల్లో.. ఎక్కువ మంది ఉంటే మండల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పత్రాలు అందజేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పరిసత్ సీఈవో వెంకటేశ్వరరావు, సీపీవో విజయలక్ష్మి, కో-ఆపరేటివ్ అధికారి అప్పలనాయుడు, డ్వామా పీడీ ఉమా పరమేశ్వరి, డీపీవో సుభాషిణి, ఫిషరీస్ డీడీ నిర్మల కుమారి, ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ వి.టి. రామారావు, మున్సిపల్ కమిషనర్ వర్మ, వివిధ విభాగాల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.