JC Kishore Kumar, Inspecting Crop Damage at Secretariat,RBK
Publish Date : 19/11/2021
పంట నష్టాన్ని పరిశీలించిన జెసి కిశోర్ కుమార్
ఆర్బికె, సచివాలయం తనిఖీ
దత్తిరాజేరు (విజయనగరం), 19.11.21 ః గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ పరిశీలించారు. ఆయన దత్తిరాజేరు మండలం వి.కృష్ణాపురంలో శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. గ్రామంలోని రైతులతో, వ్యవసాయశాఖాధికారులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదించి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయాన్ని జెసి కిశోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరును, పథకాల అమలును పరిశీలించారు. ఓటిఎస్ అమలు, కోవిడ్ వేక్సినేషన్పై ఆరా తీశారు. రైతుభరోసా కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోలు కోసం సిద్దంగా ఉంచిన తేమ కొలిచే యంత్రాలను తనిఖీ చేశారు. వాటిని ఉపయోగించే విధానంపై సిబ్బందిని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టేందుకు అన్నివిధాలా సిద్దం కావాలని జెసి ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎంపిపి జి.సింహాద్రప్పలనాయుడు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ విటి రామారావు, ఏడిఏ మహారాజన్, ఏఓ గోవిందమ్మ, తాశీల్దార్ సులోచనారాణి, ఎంపిడిఓ సుబ్రమణ్యం, గ్రామ సర్పంచ్ ఎం.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.