Close

Machine tools should be made available to all farmers, the Farmer Welfare Government said, adding that the CM, YSR ZP Chairman Majji Srinivasa Rao distributes machinery and equipment

Publish Date : 08/06/2022

రైతులంద‌రికీ యంత్ర‌ ప‌రిక‌రాలు ఉప‌యోగ‌ప‌డాలి

రైతు సంక్షేమ ప్ర‌భుత్వం ఇది

పండ‌గ క‌న్నా మిన్న‌గా వ్య‌వ‌సాయాన్ని తీర్చిదిద్దిన సి.ఎం.

వై.ఎస్‌.ఆర్‌. యంత్ర‌సేవ ప‌రిక‌రాల పంపిణీలో జెడ్పీ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు

విజ‌య‌న‌గ‌రం, జూన్ 07 :  వై.ఎస్‌.ఆర్‌. యంత్ర‌సేవ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వం రైతు గ్రూపుల‌కు అంద‌జేస్తున్న వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాలు ఆయా గ్రామాల్లోని రైతులంద‌రికీ ఉప‌యోగ‌ప‌డాల‌ని జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీతో మంజూరు చేస్తున్న  ఈ ట్రాక్ట‌ర్లు ఇత‌ర ప‌రిక‌రాలు రైతులు త‌మ సొంతానివిగా భావించొద్ద‌ని, స‌చివాల‌య పరిధిలో రైతుల‌కు ఈ యంత్రాల ద్వారా సేవ‌లు అందాల‌న్నారు. మ‌న జిల్లా వ్య‌వ‌సాయ ఆధారిత జిల్లా అయినందున‌  రైతులు ఆర్ధికంగా అభివృద్ది చెందితేనే జిల్లా అభివృద్ధి చెందుతుంద‌ని భావించి జిల్లాను వ్య‌వ‌సాయ‌ప‌రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని జెడ్పీ ఛైర్మ‌న్ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఆండ్ర‌, పెద్ద‌గెడ్డ‌, వ‌ట్టిగెడ్డ‌, వెంగ‌ళ‌రాయ సాగ‌ర్ వంటి ప్రాజెక్టుల ఆధునీక‌ర‌ణ‌తోపాటు తోట‌ప‌ల్లి ప్రాజెక్టు కాల్వ‌ల‌ను నిర్మించేందుకు రూ.125 కోట్లు మంజూరు చేశార‌ని చెప్పారు.

      వై.ఎస్‌.ఆర్‌.యంత్ర‌సేవ ప‌థ‌కంలో భాగంగా గ్రామ స‌చివాల‌యాల ప‌రిధిలో ఏర్పాటైన క‌స్ట‌మ్ హైయ‌రింగ్ గ్రూపులకు ట్రాక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాల పంపిణీని జిల్లాలో ప్రారంభించిన సంద‌ర్భంగా స్థానిక ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జెడ్పీ ఛైర్మ‌న్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక శాస‌న‌స‌భ్యులు కోలగ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి సూర్య‌కుమారి, ఎం.పి. బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన‌ప్ప‌ల నాయుడు, ఎమ్మెల్సీలు ర‌ఘురాజు, సురేష్‌బాబు త‌దిత‌రుల‌తో క‌ల‌సి జిల్లాలోని రైతు గ్రూపుల‌కు రూ.18.27 కోట్ల విలువ గ‌ల‌ 212 ట్రాక్ట‌ర్లు, మ‌రో 29 ఇత‌ర వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాల‌ను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ట్రాక్ట‌ర్లు, యంత్రాల‌పై రూ.5.96 కోట్ల రాయితీని అంద‌జేసిన‌ట్లు జెడ్పీ ఛైర్మ‌న్ తెలిపారు.

    ఈ సంద‌ర్భంగా జెడ్పీ ఛైర్మ‌న్ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వున్న‌ది రైతు సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని అన్నారు. రైతుల‌కు అన్నివిధాలుగా స‌హాయం అందించి ఆదుకోవ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ప్ర‌ధాన ధ్యేయ‌మ‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌డ‌మే కాకుండా చేసి చూపిస్తున్నార‌ని తెలిపారు.  రైతుల‌కు సేవ‌లందించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన రైతుభ‌రోసా కేంద్రాలు  నేడు రైతుల‌కు అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాల ప్ర‌శంసలు పొందుతున్నాయ‌ని పేర్కొన్నారు. వ్య‌వ‌సాయాన్ని పండుగ‌లా చేయాల‌ని దివంగ‌త వై.ఎస్‌.అనేవార‌ని, అంత‌కంటే మిన్న‌గా సి.ఎం. శ్రీ జ‌గ‌న్ చేస్తున్నార‌ని చెప్పారు.

      జిల్లా యంత్రాంగం ఖ‌రీఫ్ సీజ‌నుకు అన్నివిధాలా స‌న్న‌ద్ధం అవుతోంద‌ని ఇందుకోసం 41 వేల క్వింటాళ్ల వ‌రి విత్త‌నాల‌ను వ్య‌వ‌సాయ శాఖ సిద్ధం చేస్తోంద‌న్నారు.

     జిల్లాలోని రైతు గ్రూపుల‌కు అంద‌జేస్తున్న ట్రాక్ట‌ర్లు, ఇత‌ర యంత్ర ప‌రిక‌రాల‌ను పూర్తిస్థాయిలో స‌ద్వినియోగం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి అన్నారు. చిన్న క‌మ‌తాలు క‌లిగిన రైతుల‌కు కూడా యంత్ర ప‌రిక‌రాలు ఉప‌యోగ‌ప‌డేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. పంట‌ల సాగులో అనేక కొత్త విధానాలు, సాంకేతిక ప‌ద్ధ‌తులు వ‌స్తున్నాయ‌ని రైతులు వాటిపై అవ‌గాహ‌న ఏర్ప‌ర‌చుకొని పంట‌ల సాగును లాభ‌దాయ‌కం చేసుకోవాల‌న్నారు. రైతులు ఆనందంగా పంట‌లు పండించే ప‌రిస్థితి జిల్లాలో ఏర్ప‌డాల‌న్న‌దే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. ఇ-క్రాప్ న‌మోదు విష‌యంలో రైతులు అల‌క్ష్యం వీడి వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. ఇ-క్రాప్ లో న‌మోదైతేనే ప్ర‌భుత్వం ద్వారా వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు పొంద‌గ‌లుగుతార‌ని అందువ‌ల్ల వెంట‌నే ప్ర‌తి రైతు త‌మ పేర్లు వెంట‌నే న‌మోద చేసుకోవాల‌ని కోరారు. జిల్లాలోని రైతులంద‌రికీ అవ‌స‌ర‌మైన మేర‌కు వ్య‌వ‌సాయ రుణాలు అందించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు చెప్పారు. రైతులు త‌మ స‌మస్య‌లు ఏమైనా వుంటే వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లుల ద్వారా తెలియ‌జేస్తే వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

     విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యుడు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతాంగానికి అందిస్తున్న సేవ‌ల‌ను అంత‌ర్జాతీయ స‌మాజం కూడా గుర్తించింద‌న్నారు. విత్త‌నాల పంపిణీ  నుంచి పండించిన పంట‌ల కొనుగోలు వ‌ర‌కు అన్ని స్థాయిల్లో రైతుల‌కు సేవ‌లు అందించ‌డంతోపాటు ప‌శువుల‌కు రైతు ఇంటి వ‌ద్దే వైద్యం అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి శ్రీ జ‌గ‌న్‌దేన‌ని పేర్కొన్నారు.

      శాస‌న‌స‌భ్యులు శంబంగి చిన‌ప్ప‌ల‌నాయుడు, బ‌డుకొండ అప్ప‌ల‌నాయుడు, కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, కంబాల జోగులు, శాస‌న మండ‌లి స‌భ్యులు ర‌ఘురాజు, జిల్లా వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌లి అధ్యక్షులు గేదెల వెంక‌టేశ్వ‌ర‌రావు, డి.సి.ఎం.ఎస్‌.ఛైర్మ‌న్ అవ‌నాపు భావ‌న‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, జిల్లా వ్య‌వ‌సాయ‌ అధికారి టి.వి.రామ‌రావు, ఉద్యాన అధికారి శ్రీ‌నివాస‌రావు, డిసిసిబి సి.ఇ.ఓ. జ‌నార్ధ‌న్‌రావు ప‌లువురు ఎంపిపిలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

      తొలుత దివంగ‌త సి.ఎం. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హం వ‌ద్ద జ్యోతి వెలిగించి, నివాళుల‌ర్పించిన అనంత‌రం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. జిల్లా న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

      జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు త‌దిత‌రులు ట్రాక్ట‌ర్ల పంపిణీ సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్ల‌ను న‌డిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మతి సూర్య‌కుమారి ట్రాక్ట‌ర్ల‌ను జెండా ఊపి ప్రారంభించారు.

Machine tools should be made available to all farmers, the Farmer Welfare Government said, adding that the CM, YSR ZP Chairman Majji Srinivasa Rao distributes machinery and equipment